Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అన్నదాత ఉద్యమానికి 100రోజులు..
- టైమ్స్మ్యాగజైన్ కవర్పేజీపై రైతులు
- ఉద్యమానికి మహిళలే బలమంటూ ప్రశంస
రైతు ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. గోడీ మీడియా వెంటాడినా అన్నదాత వెనకడుగువేయలేదు. వారి ఉద్యమం నేడు (శనివారం) వందోరోజుకు చేరనున్నది. ఇక టైమ్స్ మ్యాగజైన్ కవర్పేజీలో రైతుల ఉద్యమానికి 'మహిళే బలం' అంటూ కథనం వచ్చింది. ఇది రైతు ఉద్యమానికి ఊపిరిపోసినట్టయిందని రైతు సంఘాలు ప్రశంసిస్తున్నాయి. నల్లచట్టాలు రద్దు చేయాలంటూ కదంతొక్కి వందరోజులు కావొస్తున్నది. ఈ వందరోజుల్లో ఏం జరిగింది..? మోడీ ప్రభుత్వం ఏవిధంగా ఉద్యమాన్ని నామరూపాల్లేకుండా చేయాలనుకున్నదో.. ఒక్కసారి మననం చేసుకుందాం..
న్యూఢిల్లీ : పార్లమెంట్లో కార్పొరేట్లకు అనుకూలంగా సాగుచట్టాలను ఆమోదించుకున్నప్పుడు.. రైతన్న సైలైంట్ అవుతాడనుకున్నది బీజేపీ ప్రభుత్వం. ఎక్కడో పొలం దాటని రైతు ఢిల్లీ దాకా వస్తాడా... వచ్చాక చూసుకుందామనుకున్నది. తమను నాశనం చేసే చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాత అనుహ్యంగా కదిలాడు. దీన్ని పసిగట్టిన హస్తినలోని బీజేపీ నేతలకు కలవరం పుట్టింది. ట్రాక్టర్లలో డీజిల్ నింపొద్దని ఆదేశాలు జారీచేశారు. లాఠీచార్జీలు, అక్రమ కేసులు, బలవంతపు అరెస్టులు.. ఇలా ఎన్ని అడ్డంకులు కల్పించినా..రైతులు వెనక్కితగ్గలేదు. దేశ రాజధానిలోకి అడుగుపెట్టనీయకపోవటంతో ఢిల్లీ సరిహద్దుల నే దీక్షాస్తలిగా మార్చారు. బైఠాయించారు. మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది.. చర్చలంటూ కాలయాపన చేసింది. చర్చలకు పిలవటం.. కేంద్రం నాన్చుడుధోరణిని అవలం బించటం.. రైతు బృందాలు వ్యతిరేకించటం జరుగుతూనే వచ్చింది. కోర్టు తీర్పులంటూ కాలక్షేపం చేసింది. రైతు ఉద్యమం మరింత బలపడుతున్న కొద్ది.. బీజేపీ సర్కారుకు మింగుడుపడలేదు. ఉద్యమాన్ని నీరుగార్చేలా బీజేపీ ప్రభుత్వం, మోడీ క్యాబినెట్ మంత్రులు ఎన్నో కుయుక్తులు పన్నారు. బీజేపీ అడుగులకు మడుగులొత్తే గోడీ మీడియా ఎన్నో ప్రయత్నాలు చేసింది. రోడ్లపై బారికేడ్లు,
ఇనుపమొలలు.. కొత్త తరహా లాఠీలతో ప్రత్యేక బలగాలను మొహరింపజేసింది. కానీ ఇవేం వారి ఉద్యమాన్ని నిలువరించలేకపోయాయి. అబద్దాన్నీ కూడా నిజమనేలా కిసాన్ పరేడ్ రోజున జరిగిన హింసను ప్రచారం చేసింది. ఖలిస్తాన్ జెండా అని.. పాకిస్తాన్ కుట్ర అంటూ నమ్మబలికేలా కోడైకూసింది. ఢిల్లీ సరిహద్దులు ఖాళీ చేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చి మరీ బలవంతంగా రైతుల దీక్షాస్థలిని తొలగించే కుట్రలు చేసింది. ఇక రైతు ఉద్యమం పని అయిపోయిందంటూ యాంకర్లు లైవ్గా దీక్షాస్తలి వద్దకు చేరుకున్నారు. రిపబ్లిక్డే ట్రాక్టర్ పరేడ్ తర్వాత... సీన్ మారిపోయిందని ప్రచారం చేసింది. కానీ, 'మేం చేసిన తప్పేంటీ.. రైతుల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు' అంటూ రైతునేత రాకేశ్ తికాయత్ కన్నీళ్లు అన్నదాతల్ని కదలించాయి. భారీ సంఖ్యలో రైతులు తిరిగి ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాలకు ఊహించనివిధంగా తరలివచ్చారు. జనవరి 26 తర్వాత రైతులు, కేంద్రం మధ్య ఉన్న చర్చల బంధం పూర్తిగా ఆగిపోయింది. కానీ రైతులు నిస్సహాయులుగా మారలేదు. ఇప్పటికీ రైతు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రైతును అన్ని విధాలా కేంద్ర సర్కార్ టార్గెట్ చేస్తున్నా... టైమ్స్ మ్యాగజైన్ కవర్ పేజీలో రావటం చూస్తుంటే.. ఉద్యమం నీరుగారలేదు మరింత ఉధృతంగా ఊపిరి పోసుకుంటున్నదని స్పష్టమవుతున్నది. శాంతియుత దీక్ష అంటే ఎలా ఉంటుందో వందరోజుల దీక్ష కొనసాగుతున్న తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. టైమ్మ్యాగజైన్లో వంద ప్రభావిత మహిళలో షాహిన్బాగ్ దాదీకి ప్రాధాన్యత కల్పించింది. తాజాగా మహిళా రైతులు కదం తొక్కుతున్న ఫోటోతో కవర్పేజీలో ప్రస్తావించటంతో బీజేపీ వర్గాలు మరింత కుతకుతలాడిపోతున్నాయి.
రైతు ఉద్యమ ప్రధాన డిమాండ్లు ఇవే...
1. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020
2. నిత్యావసర సరకుల(సవరణ) చట్టం-2020
3. రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020
4. విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2020
5. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ
6. కాల్యుష నియంత్రణ ఆర్డినెన్స్లో రైతు వ్యతిరేక నిబంధనలను తొలగించాలి.