Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తెచ్చుకున్న మంత్రులు
బెంగళూరు : కర్ణాటకలో మాజీ మంత్రి రమేష్ జర్కిహోలి సీడీల వ్యవహారంతో రాష్ట్రంలోని పలువురు మంత్రులు ఉలిక్కి పడ్డారు. తమకు వ్యతిరేకంగా, తమ పేరుకు భంగం కలిగించేలా ఎటువంటి వార్తలు మీడియాలో రాకుండా నిషేధించాలని కోరుతూ ఏకంగా యడియూరప్ప క్యాబినెట్లోని ఆరుగురు మంత్రులు స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు కూడా అందుకు అనుగుణంగా ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొంత మంది మంత్రులు, పలువురు బీజేపీ నేతలు కూడా ఇదేవిధంగా కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నారు. అయితే మంత్రుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వారు ఈ విధంగా కోర్టును ఆశ్రయించడం భయాన్ని, దోషిత్వాన్ని బయటపెడుతోందని పలువురు పేర్కొంటున్నారు. రమేష్ జర్కిహోలి ఉద్యోగం పేరుతో ఒక మహిళను లొంగదీసుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డారనీ, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే.
మంత్రుల చర్యను ముఖ్యమంత్రి యడియూరప్పతో పాటు మిగతా మంత్రులు వెనకేసుకొస్తున్నారు. అయితే, ఈ చర్య మరింత ఇబ్బందులకు దారితీస్తుందని, ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుందని కేంద్రమంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. కొందరు మంత్రులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. తాము తప్పు చేయలేదని భావిస్తున్నప్పుడు.. కోర్టుకు వెళ్లి ఇంజెక్షన్ ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందని పలువురు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న మంత్రులు స్పందిస్తూ.. అది మత భద్రత కోసమేనని, కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత తమకు రాజకీయ శత్రువులు ఎక్కువయ్యారన్న వాదన తెస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ 16 మంది ఎమ్మెల్యేలు 15 రోజుల పాటు బాంబే హోటల్లో గడిపారని, ఆ సమయంలో ఏమైనా జరిగివుండొచ్చని, అందుకే మంత్రులు భయపడుతున్నారని అన్నారు.