Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 100వ రోజుకు..రైతాంగ ఉద్యమం
- అన్నదాతలకు ఏఐకేఎస్, ఎస్ కేయూ అభినందనలు
- కేఎంపీ ఎక్స్ ప్రెస్ హైవేపై రైతన్న బైటాయింపు
- ఎంతగా అణచివేస్తే... అంత అధికంగా ఉద్యమిస్తాం : కృష్ణప్రసాద్, ఏఐకేఎస్, ఆర్థిక కార్యదర్శి
- మోడీజీ... రైతాంగ సంక్షేమంపై ద్వంద్వ విధానం వీడండి : బి వెంకట్, ఏఐఏడబ్ల్యూయూ
మొన్న చలికి వణికాడు. నిన్న వానకి తడిశాడు. నేడు ఎండకి ఎండుతున్నాడు. అయినా ఒక్క అడుగూ వెనక్కి వేయలేదు. ఆరుగాలం అలుపెరగకుండా శ్రమించడమే కాదు... అన్యాయాన్ని అడ్డగించడం తెలుసంటూ ప్రారంభించిన ఉద్యమాన్ని మహౌన్నతంగా కొనసాగిస్తున్నాడు. పగబట్టిన పాలకుడు పట్టించుకోకపోయినా రైతన్న మాత్రం పట్టువీడలేదు. మొక్కవోని సంకల్పంతో నినదించాడు. సాంప్రదాయ సాగు వ్యవస్థను సమాధిచేసి బూర్జువాలు, భూస్వాములకు వ్యవసాయాన్ని అప్పగించే ప్రక్రియపై గర్జించాడు. ఉజ్వలమైన ఈ రైతాంగ ఉద్యమానికి కరోనా, కఠినమైన చలి, ఎండా, వాన స్వల్ప విరామం మాత్రమే ఇవ్వగలవనీ... కర్షకుడి వంద రోజుల పోరాటంపై
నవతెలంగాణ ప్రత్యేక కథనం.
కేఎంపీ ఎక్స్ ప్రెస్ హైవేపై
రైతన్న బైటాయింపు
నవతెలంగాణ -న్యూఢిల్లీబ్యూరో
భారత సాగురంగాన్ని పూర్తిగా సమాధి చేసే వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు నవంబర్ 26న ప్రారంభించిన ఉద్యమం శనివారానికి 100వ రోజుకి చేరుకున్నది. కేంద్రంలోని రైతాంగ పోరాటాన్ని అణచివేసేందుకు మోడీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అన్నదాతల ఉక్కు సంకల్పంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మూడు సాగు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, పంటకి కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ) కల్పించాలనీ, విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2020 తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, తమ డిమాండ్లు కేంద్ర ప్రభుత్వానికి మరింత బిగ్గరగా వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు వద్ద గల కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ప్రెస్ హైవేను అన్నదాతలు విజయవంతంగా దిగ్బంధనం చేశారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోడీ సర్కారు ముర్దాబాద్... బీజేపీ సర్కారు షరం కరో... ఖేతి కానూన్ వాపస్లేవో అంటూ నినాదాలతో హౌరెత్తించారు. ఈ ఆందోళనలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేఎంపీ రోడ్డుపై బైటాయించారు. దాంతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్ళలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్నదాతల ఇంటివద్ద నలజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. ఢిల్లీ సమీప రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర తదితర ప్రాంతాల్లో సైతం భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి.
ఎంత అణచివేస్తే... : కృష్ణప్రసాద్, ఏఐకేఎస్, ఆర్థిక కార్యదర్శి
మోడీ సర్కారు అప్రజాస్వామికంగా ఆమోదించుకున్న సాగు వ్యతిరేక చట్టాల మీద ఉద్యమిస్తున్న తమని కేంద్రం ఎంత అణచివేస్తే... అంతకంటే తీవ్రంగా ఉద్యమిస్తామని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ఆర్థిక కార్యదర్శి కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమంపై మోడీ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎంపీ ఎక్స్ప్రెస్ హైవే వద్ద ఏర్పాటు చేసిన స్టేజీ దగ్గర రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గతంలో(2014 ఎన్నికల ప్రచార సందర్భంగా) మోడీ హామీ ఇచ్చిన విధంగానే ఎంఎస్పీ సీ2+50 శాతం ఇవ్వాల్సిందేనని సంయుక్త తీర్మానం చేసినట్టు చెప్పారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారనీ, మరి అదే విషయంపై ఇటు రైతు సంఘాలతో అటు రైతులతో ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు ఎందుకు చేయటంలేదని నిలదీశారు. ఇదే ప్రభుత్వం సుప్రీంకోర్టులో రైతులకు ఎంఎస్పీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడం ఏంటని నిలదీశారు. దాంతోపాటు, రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఢిల్లీ పోలీసులు బెదిరించడం, వేధించే ధోరణ అవలంభిస్తే అన్నదాతల పోరాటం ఎంతమాత్రం ఆగదని ఆయన హెచ్చరించారు. ఇదే విషయంపై సామాజిక కార్యకర్తలను అణచివేసేందుకు వందలా దిపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా నమోదు చేసిన ఒక్క కేసు కూడా కోర్టులో నిలవడం లేదని, అదే ప్రభుత్వ వేధింపులకి నిదర్శనమన్నారు. వారి వేధింపులకి రైతు ఉద్యమం ఏమైనా ఆగిందా? అని సభికులనుద్దేశించి ప్రసంగిం చారు. అన్నదాతలు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తప్పుదోవ పట్టిస్తూ... చిన్నబుచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తాము చేస్తున్న ఉద్యమం జాతీయంగా... అంతర్జాతీయం ఖ్యాతి గడించిన విషయాన్ని కష్ణప్రసాద్ గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
ద్వంద్వ వైఖరి వీడండి : బి వెంకట్, ఏఐఏడబ్ల్యూయూ
దేశానికి అన్నం పెట్టే రైతాంగ సంక్షేమం పట్ల మోడీ సర్కారు ద్వంద్వ వైఖరి వీడాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసేందుకు లేదనీ... కేవలం ప్రజా సంక్షేమం కోసమేనంటూ ప్రధాని స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో రేపటి రోజున పంట కొనుగోలుకు ఎంఎస్పీ అడిగితే తప్పించుకొని తాము వ్యాపారం చేయమని సరైన ధర ఇవ్వకుండా చెతులెత్తేస్తే అన్నదాతలకు దిక్కెవరని నిలదీశారు. ఈ ఒక్క విషయాన్ని నిశితంగా గమనిస్తే ప్రధాని మోడీ అబద్దాలు తేటతెల్లమవుతాయని చెప్పారు. శనివారం ఆయన కేఎంపీ ఎక్స్ప్రెస్ హైవే వద్ద గల రైతుల రోడ్ బ్లాక్ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమం ప్రారంభమైనట్టు వెల్లడించారు. రైతుల ఉక్కు సంకల్పంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమం అందరి దృష్టిని ఆకర్షించినట్టు వివరించారు. బీజేపీ సారథ్యంలో మోడీ సర్కారు ఎన్నినిర్బంధాలు పెట్టినా... మరెన్ని దాడులు చేసినా మొక్కవోని దీక్షతో కోట్లాది మంది రైతాంగం ఉద్యమించడం హర్షణీయమన్నారు. ప్రధాని మోడీయే స్వయంగా అసత్య ప్రచారాలు చేశారన్నారన్నారు. అయినా, రైతు విశ్వాసాన్నిమోడీ పొందలేకపోయారన్నారు. ఎందుకంటే, రైతులకి ఏది నిజమో... ఏది అబద్ధమో తెలుసన్నారు. వ్యవసాయ రంగం పట్ల మోడీ సర్కారు ద్వంద్వ నీతి వల్లనే రైతులు ప్రధాని మోడీ మాటలు ఎంతమాత్రం నమ్మడం లేదన్నారు. ఆ మూడు చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దు అయ్యే దాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశ సంపదలైన పీఎస్యూలను కార్పొరేట్లకు అమ్మివేయడంతో భారత ప్రజానీకం నోట్లో మోడీ మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయాన్ని కూడా అదానీ, అంబానీ తదితర బడా క్యాప్టలిస్టులకి ఇచ్చేందుకే ఈ చట్టాలు రూపొందించారని వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలపై అన్నదాతలు పోరాడుతున్నారని వివరించారు. చట్టాలు రద్దు అయ్యేదాకా విజయమో... వీర స్వర్గమో అన్న విధంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యమం చారిత్రాత్మకం : ఏఐకేఎస్, ఎస్కేయూ
సాగు వ్యతిరేక చట్టాలపై గత వంద రోజులుగా సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదిగా ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్), సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కేయూ) అభివర్ణించాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆ రెండు సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో దండి ఉద్యమం జరిగిందనీ, అటుతర్వాత 2019 మార్చి 12వ తేదీన ఇటువంటి ఉద్యమాలే పెద్ద ఎత్తున జరిగినట్టు స్పష్టం చేశాయి. మార్చి 6(శనివారం) కూడా రైతులు మొక్కవోని దీక్షతో పోరాటడం సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ సరిహద్దులు పూర్తిగా మూసివే యడం చారిత్రాత్మకమని వివరించాయి. ఎన్నో ఇబ్బందులు, అటంకాలు, అవమానాలకి ఓర్చి ఇంత స్థాయిలో ఉద్యమిస్తు న్న రైతాంగానికి ఏఐకేఎస్ ధన్యవాదాలు తెలిపాయి.