Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 102 నుంచి 142కు పెరిగిన శతకోటీశ్వరుల సంఖ్య
- రూ.30లక్షల కోట్లు పోగేసుకున్న కార్పొరేట్లు
- మరోవైపు 4.6కోట్లమంది పేదరికంలోకి : ఆక్స్ఫాం ఇండియా నివేదిక
న్యూఢిల్లీ : మనదేశంలో కరోనా సంక్షోభ సమయంలోనూ కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకొని బిలియనీర్లుగా మారారు. 100మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని 'ఆక్స్ఫాం ఇండియా' తాజానివేదిక తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక విధానాలు కార్పొరేట్స్, ధనికుల సంపద పెరగడానికి ఉపయోగపడ్డాయో, అవే ప్రభుత్వ నిర్ణయాలు, ఆర్థిక విధానాలు పేద, మధ్య తరగ తికి చెందిన కోట్లాది కుటుంబాల్ని పేదరికంలోకి
నెట్టాయని నివేదిక పేర్కొన్నది. సంపద కొద్ది మంది చేతుల్లో చిక్కడానికి ప్రభుత్వ విధానాలే కారణమని 'ఆక్స్ఫాం' తెలిపింది. 'ఇనీక్వాలిటీ కిల్స్' పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న మరికొన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న 2021లో కొత్తగా 40మంది శతకోటీశ్వరుల హోదాను అందుకున్నారు. వీరి సంఖ్య దేశంలో 102 నుంచి 142కు పెరిగింది. శతకోటీశ్వ రుల సంపద రూ.30లక్షల కోట్లు పెరిగింది. రూ.23.14 లక్షల కోట్ల నుంచి రూ.53.16లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే కోవిడ్ సంక్షోభ సమయంలో 4.6కోట్లమంది తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోయారు. దేశ జనాభాలో అట్టడుగున ఉన్న 50శాతం మందికి జాతీయ సంపదలో దక్కిన వాటా కేవలం 6శాతం మాత్రమే ఉంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ఆదాయాలు పడిపోయి పేదరికంలోకి వెళ్లిపోయిన జనాల్లో సగం భారత్ నుంచే ఉన్నారు.
అత్యంత ధనికులు, శతకోటీశ్వరులపై సంపద పన్ను పెంచాలని ఆక్స్ఫాం ఇండియా సూచించింది. వారి సంపదలో 1శాతం పన్నుగా ప్రభుత్వానికి ఆదాయం లభించినా..అది రూ.50వేల కోట్లు అవుతుందని, ఈ మొత్తంతో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించవచ్చునని నివేదిక తెలిపింది. దేశంలో 98మంది అత్యంత ధనికులపై కేవలం 4శాతం సంపద పన్ను వేస్తే..రెండేండ్లు హెల్త్ బడ్జెట్, 17 ఏండ్లు మధ్యాహ్న భోజనం బడ్జెట్కు సరిపోతుంది.
ఆ 10మంది సంపద డబుల్
ప్రపంచంలో 10మంది అత్యంత ధనికుల సంపద రెట్టింపు అయ్యింది. ఈ టాప్-10 సంపద సుమారుగా రూ.52లక్షల కోట్లు (700 బిలియన్ డాలర్లు) నుంచి రూ.111లక్షల కోట్ల(1.5 ట్రిలియన్ డాలర్ల)కు పెరిగింది. ఇదిలా ఉంటే, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలో 16కోట్లమంది పేదరికంలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా శ్వేతజాతియేతర మైనార్టీలు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పేదలుగా మారారని 'ఆక్స్ఫాం' తెలిపింది.
కరోనా సంక్షోభం సమయంలో కోట్లమంది జీవితాల్ని తలకిందులు కాకుండా ప్రభుత్వ పాలన, ఆర్థిక విధానాలు అడ్డుకోలేకపోయాయి. మరోవైపు ధనికులు, శతకోటీశ్వరుల సంపద మరింత పెరగడానికి దోహదపడ్డాయి. సంక్షోభ సమయాన్ని సైతం వాడుకొని కార్పొరేట్లు తమ సంపదను భారీగా పెంచుకున్నారు. శతకోటీశ్వరుల (బిలియనీర్లు) సంఖ్య 102 నుంచి 142కు పెరిగింది. భారతీయ కుటుంబాల్లో గత ఏడాది 84శాతం మంది ఆదాయం (2021లో) గణనీయంగా పడిపోయింది.
- ఆక్స్ఫాం ఇండియా