Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాణా కుంభకోణం..ఐదో కేసులో దోషిగా తేల్చిన కోర్టు
- ఖజానా శాఖ నుంచి అక్రమంగా రూ.139కోట్లు విత్డ్రా
న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఐదో కేసులోనూ ఆయన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. దొరాండా ఖజానా శాఖ నుంచి రూ.139కోట్లు అక్రమంగా విత్డ్రా చేశారన్న కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. దాంతో ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆర్జేడీ చీఫ్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు దాణా కుంభకోణంలో నమోదైన నాలుగు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ దోషిగా తేలడం గమనార్హం. అయితే ఈ నాలుగు కేసుల్లో తీర్పులకు వ్యతిరేకంగా ఆయన ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేశారు.
ఐదో కేసుకు సంబంధించి మొత్తం 170మందిపై ఆరోపణలు నమోదుకాగా, ఇందులో 55మంది చనిపోయారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. లాలూ, మాజీ ఎంపీ జగదీశ్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్పర్సన్ ధ్రువ్ భగత్, మాజీ ఉన్నతాధికారులు బెక్ జూలియస్, కె.ఎం.ప్రసాద్లు ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.
వీటితోపాటు దియోఘర్ ట్రెజరీ నుంచి రూ.89.27కోట్లతోపాటు దుంకా ట్రెజరీ నుంచి మరో రూ.3.76కోట్లను అక్రమంగా డ్రా చేశారు. ఈ నాలుగు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. తాజాగా రూ.139కోట్లకు సంబంధించిన ఐదో కేసులోనూ ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. మునపటి కేసుల్లో మొత్తం ఆయనకు 14ఏండ్ల శిక్ష పడగా..మొన్నటివరకు ఆయన జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు
1996నాటి కేసు
బీహార్లో 1996లో దాణా కుంభకోణం వెలుగు చూసిన విషయం తెలిసిందే. మొత్తం రూ.950 కోట్లకు సంబంధించిన ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్..అక్కడి పశుసంవర్ధక శాఖ నుంచి అక్రమంగా నగదు ఉపసంహరించారనే ఆరోపణలు వచ్చాయి. 1991 నుంచి 1996 వరకు పలు దఫాల్లో నగదు విత్డ్రా చేసినట్టు ఆరోపణలు రావడంతో ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ను సీబీఐ కోర్టు నిందితుడిగా చేర్చింది. 2013 సెప్టెంబర్లో లాలూను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో ఆయనకు బెయిల్ లభించింది. తర్వాత మరికొన్ని కేసుల్లో శిక్ష పడటంతో 2017 డిసెంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు (దాదాపు మూడున్నరేండ్లు) లాలూ ప్రసాద్ యాదవ్ జైలులోనే ఉన్నారు. ఐదో కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరి 29 నాటికి వాదనలు పూర్తయ్యాయి. దాదాపు 25ఏండ్ల తర్వాత ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడం గమనార్హం.