Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్కు రూ. 10 మోత?
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఈ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో దాదాపు మూడు నెలలుగా అంటే 110 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదు. మన దేశంలో పెట్రో ధరలు పెరగకపోవడానికి గల కారణం ఎన్నికలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ముడిచమురు ధర 99.38 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా పెట్రో ధరలు పెరగాలి. కానీ పెరగకపోవడానికి గల కారణం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలే. అయితే ఎన్నికల తర్వాత కచ్చితంగా పెట్రో వాతకు సిద్ధంగా ఉండాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 10 శాతానికి పైగా వాటా రష్యాదే. అంతేగాక యూరప్ దేశాలకు సహజవాయు అవసరాలను మూడో వంతు రష్యానే తీరుస్తోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్ దేశాలకు రష్యా చమురు సరఫరా చేయడం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే రష్యా నుంచి యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లు ఉక్రెయిన్ గుండా వెళతాయి. అంతటి కీలకస్థావరంగా ఉన్న ఉక్రెయిన్ను ఇప్పుడు యుద్ధ మేఘాలు అలుముకొనడంతో.. చమురు సరఫరాకు ఆటకం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా - ఉక్రెయిన్ల్లో నెలకొన్న సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతేడాది క్రూడాయిల్ ధరలను పరిశీలిస్తే.. 2021 అక్టోబరులో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ 86.40 డాలర్లకు చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 2021 నవంబరు 5 నాటికి 82.74 డాలర్లకు, డిసెంబరు నాటికి 68.87 డాలర్లకు దిగింది. ఇలా ధరలు తగ్గడంతోపాటు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మన చమురు కంపెనీలు ధరల పెరుగుదలను నిలిపివేశాయి. కానీ, ఉక్రెయిన్ సంక్షోభంతో ముడిచమురు ధర మళ్లీ పెరుగుతూ వచ్చింది. ఒక్క ఫిబ్రవరిలోనే 12 శాతం మేర పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరగకపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా అంతర్జాతీయ ధర పెరిగినా, మన దేశంలో 19 రోజులపాటు పెట్రోల్ ధర పెరగలేదు. ఎన్నికలు అయిన తర్వాత వరుసగా 16 రోజులపాటు పెట్రో ధర పెరుగుతూనే వచ్చింది. అలాగే 2017లో గుజరాత్ ఎన్నికల సమయంలో 14 రోజులపాటు పెట్రో ధర పెరగలేదు. ఆ తర్వాత ధరలు పెరిగాయి. అలాగే 2017 జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 దాకా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అప్పుడు కూడా ప్రభుత్వం పెట్రో ధరలను పెంచలేదు. 2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా చమురు కంపెనీలు రేట్లను పెంచలేదు. అయితే అన్నిరోజుపాటు ధర పెరగకుండా అలా పట్టి ఉంచినా.. పోలింగ్ మరుసటి రోజు నుంచే బాదుడు షురూ చేశారు. రష్యా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే చమురు శాతం 1 శాతానికి తక్కువే ఉంది. అయితే రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం చూపనుందని, అవి మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశముందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ద్రవ్య స్థిరత్వ అభివద్ధి మండలి సమావేశంలోనూ చమురు ధరలపై చర్చించినట్లు ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల పూర్తయిన తర్వాత లీటర్ పెట్రోల్ ధర ఎనిమిది నుంచి పది రూపాయలు పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరించారు.