Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆరోగ్యం మంత్రిత్వ శాఖ వెబినార్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య విద్యను ప్రోత్సహించేందుకు విధానాలను రూపొందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద నగరాలకు మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే విధంగా పరిపూర్ణ వ్యవస్థను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్ట పరిచే లక్ష్యంలో భాగంగా కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శనివారం నిర్వహించిన వెబినార్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ ''వన్ ఇండియా, వన్ హెల్త్'' (ఒక భారత దేశం, ఒకే రకమైన ఆరోగ్య సదుపాయాలు) స్ఫూర్తితో పరిపూర్ణ ఆరోగ్య మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. పెద్ద నగరాలకు వెలుపల ఆరోగ్య సంరక్షణ సంబంధిత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని తన ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో గ్రామాలకు సైతం అత్యవసర ఆరోగ్య సదుపాయా లను చేరువ చేయడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. వీటి నిర్వహణ, ఆధునికీకరణలో ప్రయివేటు రంగం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున విద్యార్థులు చిక్కుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్య విద్యను ప్రోత్సహించేందుకు విధానాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ డిమాండ్ను సైతం తీర్చే స్థాయిలో రానున్న సంవత్సరాల్లో వైద్యులను, పారామెడిక్స్ను సిద్ధం చేయడానికి తగిన పథకాలకు రూపకల్పన చేయాలన్నారు. వైద్య కళాశాలల ఏర్పాటు కోసం భూములను కేటాయించాలన్నారు. నేడు మన పిల్లలు చదువుకోవడం కోసం, మరీ ముఖ్యంగా వైద్య విద్యను అభ్యసించేందుకు, చిన్న దేశాలకు వెళ్తున్నారన్నారు. అక్కడ భాషా సమస్య ఉందని, అయినప్పటికీ వెళ్తున్నారని చెప్పారు. ఈ రంగంలోకి ప్రయివేట్ రంగం భారీ స్థాయిలో ప్రవేశించడం సాధ్యం కాదా? అని అడిగారు. భూ కేటాయింపుల కోసం మంచి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించడం సాధ్యం కాదా? అన్నారు.