Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కవి, మానవ హక్కుల కార్యకర్త వరవరరావుకు మంజూరైన మెడికల్ బెయిల్ను మార్చి 3 వరకు బాంబే హైకోర్టు పొడిగించింది. 2017 డిసెంబరు 31న పూనేలో జరిగిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ దాఖలైన కేసులో వరవరరావుతోపాటు పలువురు కార్యకర్తలు అరెస్టయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో 82 ఏళ్ల వరవరరావుకు ఆరోగ్య కారణాల రీత్యా హైకోర్టు ఆరు మాసాల పాటు బెయిల్ ఇచ్చింది. ముంబయిని వీడి వెళ్లరాదని ఆదేశించింది. ఆ తర్వాత బెయిల్ను పొడిగించాలని, తన అనారోగ్యం దృష్ట్యా శాశ్వత బెయిల్ను ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత నుంచి కోర్టు ఆయన బెయిల్ పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం తాను పార్కన్సన్ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నానని, మెదడుకు సంబంధించిన కొన్ని రుగ్మతలు కూడా వేధిస్తున్నాయని, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నానని వరవరరావు తన పిటిషన్లో పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన తెలంగాణాకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు.