Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత దళిత కుటుంబాన్ని పరామర్శించిన సిపిఎం, డిఎస్ఎంఎం ప్రతినిధి బృందం
సోన్పెడ: హర్యానాలో దళిత కుటుంబంపై అగ్రవర్ణాల దాడి ఘటనకు సర్కారు పూర్తి వైఫల్యమేనని బృందాకరత్ విమర్శించారు. సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్, కేంద్ర కమిటీ సభ్యులు ఇంద్రజిత్ సింగ్, దళిత్ సోషన్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) డిసిఎంఎం నాయకులు, సిపిఎం హర్యానా రాష్ట్ర నేతలతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం సోన్పెడ గ్రామాన్ని సందర్శించింది. తమ కుటుంబంపై దాడి జరిగే అవకాశముందని జితేందర్ ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు దానిని విస్మరించారని, ఫలితంగా ఇద్దరు అమాయక చిన్నారులు సజీవ దహనానికి కారణమయ్యారని ప్రతినిధులు విమర్శించారు. దళితుల ఫిర్యాదులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విలువా ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఫిర్యాదుపై చర్య తీసుకునే ఉంటే అమాయక చిన్నారులు ఇవాళ ప్రాణాలతో ఉండేవారని బృందాకరత్ అన్నారు. ఘటన జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం గ్రామాన్ని సందర్శించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దళిత కుటుంబంపై అగ్రవర్ణాల దుశ్చర్యను ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ భీకర ఘటనను నివారించి ఉండేవారు. ఈ కుటుంబానికి భద్రత కల్పించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలో విఫలమైంది. నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరాదు. ప్రస్తుతం రేఖ మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ కుటుంబానికి నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్య తీసుకోవాలని, అలాగే ఎస్సి, ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం కింద నేరస్తులపై కేసు నమోదుచేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.