Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబిఐ చార్జిషీట్ దాఖలు ..అన్యాయమన్న జెడి(యు) ఎంపి
న్యూఢిల్లీ: జెడి(యు) బీహార్ ఎంపి అనిల్ కుమార్ సహానిపైన, మరి ముగ్గరిపైన సిబిఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. 2013లో బట్టబయలైన ఎల్టిసి కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఈ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణం వల్ల ఖజానాకు రూ. 23.71 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని సిబిఐ పేర్కొంది. అయితే, ఈ కుంభకోణంతో తనకెలాంటి సంబంధమూ లేదని సహాని తోసిపుచ్చారు. ఈ కుంభకోణం రాజ్యసభను కుదిపేసింది. బీహార్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తనపై నకిలీ చార్జిషీట్ దాఖలుచేయించడం ద్వారా కేంద్రం మరోసారి సిబిఐని దుర్వినియోగం చేస్తోందని సహాని ఆరోపించారు. రాజ్యసభ సభ్యు నిగా సహాని పదవీకాలం 2018లో ముగుస్తుంది. ఢిల్లీకి చెందిన ఎయిర్ క్రూయిజ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఉద్యోగి అనూప్ సింగ్ పన్వార్, ఎయిర్ ఇండియాలో అప్పటి ఆఫీస్ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) ఎన్ఎస్ నాయిర్, అరవింద్ తివారీలను కూడా సిబిఐ తన చార్జిషీటులో చేర్చింది. తనను అపఖ్యాతి పాలుచేయడానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం చేస్తున్న 'రాజకీయ కుట్ర' ఇది అని సహాని విలేఖరులతో అన్నారు.