Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలిఫోర్నియా వర్సిటీకి మేధావుల వినతి
న్యూఢిల్లీ, ఐఎన్ఎన్ : భారతదేశంలోని మైనారిటీ వర్గాలపై దాదాగిరి చెలాయించే ఆర్ఎస్ఎస్కు మేధోదాస్యం చేయగూడదని ప్రముఖ మేధావులు పిలుపునిచ్చారు. చారిత్రక సాక్ష్యాధారాలతో లేదా శాస్త్రీయ పద్ధతులతో నిమిత్తం లేకుండా తమ సైద్ధాంతిక ఎజెండాకు అనుగుణంగా ప్రచారం సాగించే మితవాద ఆర్ఎస్ఎస్ ఇప్పుడు తమ అనుబంధ సంస్థల ద్వారా కాలిఫోర్నియా యూనివర్సిటీలో నాలుగు అధ్యయన కేంద్రాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని మేధావులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని మూడు మతాలను, ఆధునిక భారత చరిత్రను అధ్యయనం చేయడం ఈ కేంద్రాల ఉద్దేశ్యమని చెప్పారు. ఈనాడు తీవ్రంగా నిధుల కొరతను ఎదుర్కొనే యూనివర్శిటీలు దాతల నుండి విరాళాలు అందుకోవాల్సి వస్తోంది. కానీ, ప్రస్తుత కేసులో దాతలు, ఆ అధ్యయన కేంద్రాలకు ఎవరు అధ్యక్షులుగా వుండాలో, వుండకూడదో సూచనలు చేస్తున్నారని, అదే ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. దాంతో అలా నియమితులయ్యే అధ్యక్షులు దాతలు చెప్పినట్టు వినాల్సి వస్తుందని, నిష్పాక్షిక మేధో విచారణ వీరి లక్ష్యం కాదని, ఒక సైద్ధాంతిక ప్రాజెక్టును అభివృద్ధిపర చడమే ఉద్దేశ్యమని ప్రభాత్ పట్నాయక్, ఇర్ఫాన్ హబీబ్, పి.కె.శుక్లా, అమర్ ఫరూకి, సి.పి.చంద్రశేఖర్ ప్రభృతులు పేర్కొన్నారు. హిందూత్వ శక్తులు చేపట్టిన ఈ ప్రాజెక్టు పట్ల ఉదాసీనత వద్దని కాలిఫోర్నియా యూనివర్శిటీకి వారు విజ్ఞప్తి చేశారు. వారి విరాళాలను అడ్డుకోవాలని కోరారు. హేతుబద్ధతతో, విమర్శనాత్మక దృక్పథంతో ఆలోచించే యూనివర్శిటీ ఏదైనా సరే ఇటువంటి వనరుల నుండి నిధులు తీసుకోరాదని వారు కోరారు.