Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడ వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు: డేవిడ్ హేడ్లీ
ముంబై: 26/11 ముంబైపై దాడుల ప్రధాన నిందితుడు, లష్కర్-ఏ-తోయిబా కమాండర్ లఖ్వీని పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పుడైనా అరెస్ట్ చేసినా, అది నాటకీయమేనని డేవిడ్ హేడ్లీ తెలిపాడు. మరో నిందితుడు హఫీజ్ సయీద్కు కూడా పాక్ ప్రభుత్వం ఎటువంటి హానీ తలపెట్టదని, తనకు ఈ విషయం మరో ఉగ్ర నేత సజీద్మీర్ ద్వారా తెలిసిందని హేడ్లీ వెల్లడించాడు. ముంబైపై దాడిలో నిందితులైన ఉగ్రవాదులపై విచారణ పేరుతో పాకిస్థాన్ కాలయాపన చేస్తుందే తప్ప, వారిపై ఎటువంటి చర్యలూ చేపట్టదని హేడ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుతం అమెరికా జైలులో ఉండి అప్రూవర్గా మారిన నిందితుడు హేడ్లీని ముంబైలోని ప్రభుత్వ విచారణాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం కూడా ప్రశ్నించారు. ముంబైపై ఉగ్ర దాడి, ఉగ్రవాదుల కార్యకలాపాల గురించి ఐదో రోజు విచారణలోనూ హేడ్లీ పలు విషయాలను వెల్లడించాడు.
ఉగ్ర నేతలను కోడ్ భాషలో పిలిచేవాడినని, హఫీజ్ సయీద్కు ఓల్డ్ అంకుల్, లఖ్వీకి యంగ్ అంకుల్ అంటూ మారు పేర్లు పెట్టినట్టు తెలిపాడు. ముంబై బాంబు పేలుళ్ల సమయంలో భారత్లోని(తాజ్ హోటల్లో ఉన్న) ఉగ్రవాదులతో కరాచీ నుంచి ఉగ్ర నేతలు అబూ ఖఫా, అబూ అల్ ఖమా, సాజిద్ మీరా జరిపిన సంభాషణల రికార్డులను వినిపించగా హేడ్లీ గుర్తించాడు.
ముంబైపై దాడికి ప్రణాళికను సిద్ధం చేయడంలో కీలక పాత్ర వహించిన హేడ్లీ..దాడి జరిపి నపుడు లాహోర్లో ఉన్న విషయం తెలిసిందే. ఐతే, ఆ తర్వాత 2009లో భారత్ వచ్చానని, ఆ సమయంలో తనను పోలీసులు గుర్తిస్తే అరెస్ట్ చేస్తారని భయపడ్డానన్నాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు 2009 మార్చి 16న పూణేలోని భారత సైనిక దక్షిణ కమాండ్ హెడ్క్వార్టర్స్ను సందర్శించానని హేడ్లీ తెలిపాడు. 2009 మార్చిలో అల్ఖైదా నేత ఆదేశాల మేరకు గోవా, పుష్కర్(రాజస్థాన్)లను కూడా సందర్శించినట్టు తెలిపాడు. ఈ మూడు పట్టణాల్లోనూ పలు ప్రదేశాలను వీడియో తీసినట్టు హేడ్లీ పేర్కొన్నాడు.