Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకేతో కలసి పోటీ చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. శనివారం ఇక్కడ డీఎంకే అధినేత కరుణానిధితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. 'డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా ప్రధాన లక్ష్యం' అని భేటీ అనంతరం మీడియాతో చెప్పారు. కలిసివచ్చే ఇతర పార్టీలతో డీఎంకే నాయకత్వం చర్చలు జరుపుతుందని, ఆ తర్వాత సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, ఈ సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించాల్సిన పనిలేదన్నారు. 'పూర్తి సహకారం అందిస్తానని కాంగ్రెస్ వాగ్దానం చేసింది' అని డీఎంకే కోశాధికారి స్టాలిన్ చెప్పారు. 'డీఎండీకేకు కరుణానిధి ఇప్పటికే ఆహ్వానం పలికారు. సానుకూల స్పందన వస్తుందన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది' అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.