Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 79 అభివృద్ధి చెందుతున్నదేశాల్లో 60వ స్ధానంతో సరి
- పాక్ కన్నా దిగువన
- నైపుణ్య సూచీలోనూ తిరోగమనం
దావోస్: అభివృద్ధిలో అన్ని వర్గాలనూ కలుపుకుని ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేస్తామని మోడీ సర్కార్ ఊదర గొట్టడం ప్రచారార్భాటమేనని ప్రస్ఫుటమైంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) తాజా నివేదిక సర్కార్ వాదనలో డొల్ల తనాన్ని బయటపెట్టింది. సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ 60వ స్ధానంతో సరిపెట్టుకుంది. 79 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో పొరుగు దేశం పాకిస్తాన్ కంటే దిగువన అట్టడుగున నిలిచింది.ఆర్థిక వృద్ధితో పాటు అదే సమయంలో ఆర్థిక అసమానతలను తగ్గించే క్రమంలో కీలక అవకాశాలను పలు దేశాలు కోల్పోతున్నాయని ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. సత్వర వృద్ధిని సాధించే క్రమంలో విధాన నిర్ణేతలు దశాబ్ధాల నుంచి అనుసరిస్తున్న వృద్ధి నమూనాలను తిరిగి కాలానుగుణంగా మార్పులు చేపట్టకపోవడం దీనికి కారణమని వ్యాఖ్యానించింది. సమ్మిళిత అభివృద్ధి సూచీని 12 సామర్ధ్య సంకేతాల ప్రాతిపదికన నిర్ధారిస్తారు. ఈ క్రమంలో కేవలం స్థూల జాతీయోత్పత్తిని మాత్రమే ప్రామాణికంగా తీసుకోరు. వృద్ధి- అభివృద్ధి, సమ్మిళిత సమానత్వం, కొనసాగింపు వంటి
మూడు కీలక అంశాలపై దీన్ని లెక్కిస్తారు. ఈ క్రమంలో 79 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో లిథూనియా అగ్రస్ధానంలో నిలిచింది.అజర్బైజాన్, హంగరీ ద్వితీయ, తృతీయ స్ధానాల్లో ఉన్నాయి. ఇక భారత్ 60వ స్ధానంలో నిలవగా పొరుగు దేశాలు చైనా 15వ స్ధానంలో నేపాల్ 27, బంగ్లాదేశ్ 36, పాకిస్తాన్ 52వ ర్యాంక్లు సాధించాయి.ఇక రెండు బ్రిక్ దేశాలు రష్యా, బ్రెజిల్లు వరుసగా13, 30వ స్ధానాలు దక్కించుకున్నాయి. పోలాండ్ (4), రుమేనియా (5),ఉరుగ్వే (6),లాత్వియా (7), పనామా (8), కోస్టారికా (9),చిలీ (10) దేశాలకు టాప్ టెన్లో చోటుదక్కింంది.
రుణభారంతో కుదేలు: భారత్ కేవలం 3.38 స్కోర్తో సమ్మిళిత అభివృద్ధి సూచీలో 79 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో 60వ స్ధానంలో నిలిచిందని నివేదిక పేర్కొంది. దేశ ఆర్ధిక కార్యకలాపాల్లో కార్మిక వర్గ భాగస్వామ్య రేటు తక్కువగా ఉందని, అసంఘటిత రంగ వాటా అత్యధికంగా ఉందని నివేదిక తెలిపింది.కార్మికులకు సామాజిక ప్రయోజనాలు మెరుగ్గా లేవని, పనిపరిస్థితులు సరిగ్గా లేవని, కార్మికులు, ఉద్యోగులు అభద్రతతో సతమతమవుతున్నారని పేర్కొంది. తలసరి జీడీపీలో వృద్ధి వంటి అంశాల్లో మెరుగ్గానే ఉన్నా దేశ రుణాలు జీడీపీ నిష్పత్తి అత్యధికంగా ఉండటం, ప్రభుత్వ వ్యయంలో నిలకడ లేమితో భారత్కు అట్టడుగు స్ధానం దక్కిందని నివేదిక వెల్లడించింది. అవినీతి, మౌలికవసతుల లేమి, ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం వంటి కారణాలతో భారత్లో కొత్త పరిశ్రమలకు అవరోధాలు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇక అభివృద్ధి చెందిన దేశాల్లో నార్వే అగ్రస్ధానంలో నిలవగా లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ వరుసగా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కల దేశాల జాబితాలో టాప్ టెన్లో స్వీడన్(6), నెదర్లాండ్స్ (7), ఆస్ట్రేలియా (8), న్యూజిలాండ్ (9), ఆస్ట్రియా (10) చోటు దక్కించుకున్నాయి.
నైపుణ్య పోటీతత్వ సూచీలోనూ వెనుకంజ
దేశంలో నెలకొన్న సంక్లిష్ట వాణిజ్య పరిస్థితులు, నైపుణ్యంతో కూడిన కార్మికుల కొరతతో ప్రపంచ నైపుణ్య పోటీతత్వ సూచీలోనూ భారత్ మరింత దిగజారింది. గతంలో ఈ సూచీలో 78వ స్ధానంలో నిలిచిన భారత్ ఈసారి 11 స్ధానాలు పతనమై 89వ ర్యాంక్కు పడిపోయింది. గ్లోబల్ టాలెంట్ ఇండెక్స్లో స్విట్జర్లాండ్ తొలిస్ధానం దక్కించుకుంది. ఈ సూచీలో లక్సెంబర్గ్, అమెరికా, డెన్మార్క్లు టాప్ ఫైవ్ జాబితాలో ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో భారత్ చిట్టచివరి స్ధానంలో నిలవగా 48వ ర్యాంక్తో బ్రిక్స్ దేశాల్లో చైనా ముందుభాగాన నిలిచింది. నైపుణ్యాల సృష్టి, నైపుణ్యాలను ఆకర్షించడం, నిలబెట్టుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంక్లను ఏటా అందిస్తారు. ఉన్నత విద్యపై దృష్టిసారించే పలు దేశాలు వృత్తివిద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని అథ్యయనంలో వెల్లడైంది. వృత్తి విద్యా నైపుణ్యాల్లో మానవ వనరుల కొరత కారణంగానే ఈ సూచీలో భారత్ ర్యాంక్ గణనీయంగా పడిపోయిందని ర్యాంక్లను ప్రకటించిన ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ అథ్యయనం పేర్కొంది. ముఖ్యంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఇతర దేశాలకు వలస వెళ్లడం భారత్కు ఇబ్బందికరమని, దీన్ని అధిగమించడం భారత్ ముందున్న సవాలని తెలిపింది. మేక్ ఇన్ ఇండియాను పటిష్టపరిచేందుకు భారత్లో మెరుగైన యంత్రాంగం లేదని పేర్కొంది. నైపుణ్యంతో కూడిన మానవ వనరుల లేమి దీనికి ప్రతిబంధకంగా మారిందని విశ్లేషించింది.