Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజమండ్రి: మరో రెండు రోజులు. ఎపి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న గోదావరి పుష్కరాలు ఆరంభమయ్యే సమయం. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. పుష్కరాల ప్రారంభం నుంచి రోజూ కనీసం 10-12 లక్షల మంది స్నానమాచరిస్తారు. పుష్కర కాలం ముగిసే సరికి కోటిమందికి పైగా భక్తులు పుష్కర స్నానంతో పాటు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసే అవకాశం ఉందని ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం.. ఆ స్థాయిలో వస తులను కల్పించడంలో చేతులెత్తేసింది. పుష్కరాల ప్రారంభ తేదీ, స్నానానికి వచ్చే భక్తుల సంఖ్యపైనా ప్రభుత్వానికి ముందే ఓ అంచనా ఉన్నా, సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయడంలో అడుగడుగునా అలసత్వాన్ని వహించింది. పుష్కరాల ప్రారంభ సమయానికీ పలు నిర్మాణ పనులు పూర్తి కాలేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి పుష్కరాల ప్రధాన కేంద్రం రాజమండ్రి. ఇక్కడ ఉన్న ఘాట్లు 18. ఇందులో ఎనిమిది ఘాట్లు రాజమండ్రి పట్ణణం, మరో ఎనిమిది రాజమండ్రి గ్రామీణం పరిధిలో ఉన్నాయి. ప్రముఖుల కోసం కట్టిన వీఐపీ ఘాట్, అతి పెద్దదిగా భావించే కోటి లింగాల ఘాట్ నగర పరిధిలోనే ఉన్నాయి. వాటితోపాటు గౌతమి, అయ్యప్ప (వ్యాఘ్రేశ్వర), పాత పుష్కర ఘాట్, టీటీడీ ఘాట్లు ఉన్నాయి. వాటిల్లో అయ్యప్ప ఘాట్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఘాట్ నిండా సిమెంట్ మూటలు, పలకలు (టైల్స్) చెల్లాచెదురుగా పడి కనిపించాయి. వీఐపీ ఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ.9.9 కోట్లు. ఈ ఘాట్లో రోజూ లక్షమందికి పైగా భక్తులు స్నానమాచరించడానికి వీలు ఉంది. సగానికి పైగా ఘాట్లల్లో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి అవసరమైన గదులు లేవు. కోటిలింగాల ఘాట్ వద్ద రెండే గదులు నిర్మించారు. ఒకేసారి స్నానమాచరించే లక్షలాది మంది భక్తులకు ఈ గదులు ఏ మాత్రం సరిపోవు.
గ్రామీణ ఘాట్లపై నిర్లక్ష్యం..
పట్టణ పరిధిలో ఉన్న ఘాట్లపై ఉన్న శ్రద్ధ గ్రామీణ ఘాట్లపై పెట్టలేదు. గ్రామీణ ఘాట్లల్లో సైతం పనులు నెమ్మదే. ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులొచ్చినా పట్టణ ఘాట్ల పనుల పర్యవేక్షణపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప గ్రామీణంపై కన్నెత్తి చూడటం లేదు. పర్యవేక్షణ లోపించడంతో అధికారులు, కాంట్రాక్టర్లు సకాలంలో పనులను పూర్తి చేయడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని గోష్పాద క్షేత్రం ఘాట్లో రోడ్లు, షెడ్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
బ్యారికేడ్లతో దిగ్బంధం..
పుష్కర ఘాట్లకు దారి తీసే ప్రతి రోడ్డులోనూ ఇనుప బ్యారికేడ్లను కట్టారు. అసలే ఇరుకుగా ఉండే రాజమహేంద్రి రోడ్లు ఈ బ్యారికేడ్లతో మరింత కుంచించుకుపోయింది.బ్యారికేడ్ల మధ్య ఉన్న వెడల్పు అర మీటరు. ఒక్కో రోడ్డుపై 4-6 బ్యారికేడ్లను అమర్చడం విమర్శలు దారి తీస్తోంది. ఘాట్లకు ఎదురుగా ఉండే వీధుల నిండా బ్యారికేడ్లే. బ్యారికేడ్ల కోసం రోడ్లనూ తవ్వేశారు. రోడ్లపై మూడడుగుల గుంతలు ఏర్పడ్డాయి.
నడవక తప్పదు..
ఘాట్లకు చేరుకోవడానికి భక్తులు నడకను ఆశ్రయించాల్సిందే. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ఘాట్ల వరకూ చేరనివ్వడం లేదు. వాహనాల కోసం రాజమండ్రి నగరం బయట 54, లోపల 86 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాల నుంచి ఘాట్ల సమీపానికి భక్తులను తరలించడానికి ఆర్టీసీ యాజమాన్యం 300 బస్సులను ఉచితంగా నడిపిస్తోంది. ప్రతి అయిదు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచేలా వాటిని ఏర్పాటు చేసింది. ఉచిత బస్సులు నిలిచే ప్రదేశానికి ఘాట్లకు ఉన్న మధ్య దూరం కనీసం రెండు కిలోమీటర్లు. భక్తుల రద్దీ పెరిగితే ఈ దూరం మరింత పెరగడం ఖాయం.
వైద్య శిబిరాలు లేవు..
లక్షలాది మంది భక్తులు ఒకే చోట చేరుకునే ప్రదేశంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు అధికం. దీన్ని ఎదుర్కొనడానికి వైద్యపరంగా తీసుకున్న చర్యలు ఇప్పటిదాకా ఏమీ లేవు. స్వయంగా ఆరోగ్యమంత్రే వైద్య శిబిరాలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం చెబుతున్నా.. పుష్కరం ప్రారంభం నాడే వాటిని ఏర్పాటు చేయొచ్చు. ఘాట్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని స్థానిక అధికా రులు చెబుతున్నా, ఆ అవకాశం లేదని ప్రభుత్వ వైఖరి స్పష్టం చేస్తోంది. వైద్య శిబిరాల కోసం అవసరమైన చోటు ఎక్కడో అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఆదేశాలు రాలేదని స్పష్టం చేస్తున్నారు.
రేట్లు విపరీతం..
పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ఉండే హౌటళ్లలో గదుల అద్దెను రెట్టింపు చేశారని కొందరు భక్తులు మీడియా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. అధిక రేట్లు పెట్టినా నాణ్యమైన ఆహారం లేదని చెప్పుకొచ్చారు. హౌటళ్లను తనిఖీ చేయడానికి జిల్లా అధికారులు ప్రత్యేకంగా తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేయలేదు.