Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
అగర్తలా: భారత్లో ముంబై, చెన్నైల తర్వాత మూడో అతిపెద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్వేగా అగర్తలాను మార్చనున్నట్లు కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన అగర్తలాలో సంబంధిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి అగర్తలాను కేంద్రంగా ఎంచుకున్నామన్నారు. ఈ రాష్ట్రాలకు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ కేబుల్ సంస్థ నుండి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. బిఎస్ఎన్ఎల్- బంగ్లాదేశ్ సబ్మెరైన్ కేబుల్ కంపెనీ లిమిటెడ్ ఒప్పందంలో 2016 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, దీంతో 10 జిబి బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్ను వాడుకోవచ్చన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చాలా డబ్బు ఆదా అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.19.1 కోట్లు, నిర్వహణకు ప్రతీ సంవత్సరం దాదాపు రూ.7.2 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశంలో న్యూఢిల్లీ, బెంగుళూర్, ముంబై, చెన్నై, కొల్కతా ఇంటర్నెట్ గేట్వేలుగా కొనసాగుతున్నాయి.