Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రబాబు చిందులు
- పుష్కర పనుల తీరుపై అసంతృప్తి
- మేయర్కు మందలింపు
- భారీ బారికేడ్ల ఏర్పాటుపై అక్షింతలు
- పారిశుధ్యం సరిగా లేదని ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
రాజమండ్రి:పుష్కర పనుల అలసత్వంపై ఎపి సిఎం చంద్రబాబు అధికా రులపై మండిపడ్డారు. రాజ మండ్రి మున్సిపల్ కమి షనర్ జె.మురళిని తీవ్రంగా మందలించారు. పనిచేయడం చేతకాదా.. అంటూ నిప్పులు చెరిగారు. సొంతపార్టీ వారినే సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారంటూ రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్ పంతం రజనీ శేషసాయిని మందలించారు. పారిశుధ్యం అధ్వానంగా మారడంతో నగరపాలక సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర పనుల పరిశీలనకు శనివారం మధ్యాహ్నం మధురపూడి విమానా శ్రయానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. సెంట్రల్ జైల్ వద్ద రూ.4.25 కోట్లతో ఏర్పాటుచేస్తున్న అమ్యూజ్ మెంట్ పార్కును సందర్శించి, సత్వరమే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం పశువుల ఆసుపత్రి వద్ద పారిశుధ్యం అధ్వానంగా ఉండడంపై కమిషనర్ను తీవ్రంగా మందలించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్, మేస్త్రి అప్పారావును సస్పెండ్ చేయాల్సిందిగా మున్సిపల్ శాఖామంత్రి నారా యణను ఆదేశించారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ జంక్షన్ వద్ద రంగులు ఎందుకు వేయలేక పోయారని అర్బన్ జిల్లా ఎస్పి ఎస్.హరికృష్ణను ప్రశ్నించారు. ఈనెల 2న రాజమండ్రిలో నిర్వహిం చిన సమీక్షా సమావేశంలో యాత్రికులను ఇబ్బందు లు పెట్టే విధంగా బారికేడ్లు వద్దని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని, వాటి కోసం రోడ్లకు కన్నాలు ఎందుకు పెట్టారని అర్బన్ ఎస్పిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొడవైన బారికేడ్లు వద్దని ఆదేశించారు. త్రీటౌన్ వద్ద లైటింగ్ స్తంభాలు సక్రమంగా లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ మురళిని ఆయన మందలించారు. 'స్తంభాలకు పునాదులు లేకుండా ఎలా నిర్మించారు? బలమైన గాలులు వీస్తే పడిపోతాయి. పనిచేయడం చేతకాదా?' అంటూ మందలించారు. ఆయన ఆర్యాపురంలోని నల్లా ఛానల్ డ్రెయినేజీని పరిశీలించారు. డ్రైనేజీలోని సిల్టును రోడ్డుపై వేయడంతో రోడ్డు అపరిశుభ్రంగా ఉందని కమిషనర్ను మందలించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మేయర్ రజనీ శేషసాయితో 'అధికారులు, సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంలో ఎందుకు విఫలమ య్యారు? అభివృద్ధి పనులు చేయించడం తెలీదా..?' అంటూ సిఎం మందలించారు. అనంతరం ఆయన కోటిలింగాలపేటకు చేరుకుని అక్కడే బస్సులో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కోటిలింగాల ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన భారీ కేడ్లను పరిశీలించి, అక్కడి నుంచి సీతంపేట వరకూ సుమారు కిలోమీటరు దూరం బారికేడ్లు నిర్మించడంపై ఆయన మండిపడ్డారు. యాత్రికులను ఇబ్బందులు పెట్టొద్దని, ఫ్రీగా వదిలితేనే ఇబ్బందులు ఉండవన్నారు. కోటిలింగాలరేవులో టైల్స్ ఫినిషింగ్ బాగాలేదని ఇరిగేషన్ ఎస్ఇ సుగుణాకరరావుపై మండిపడ్డారు. ఘాట్లో శుభ్రత లేదని, టైల్స్ అంటింపు సరిగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘాట్లోనూ విద్యుత్ పోల్స్కు బేస్మెంట్ లేకపోవడాన్ని గమనించి, బలమైన గాలి వీస్తే పడిపోతాయనీ, పటిష్టంగా నిర్మించాలనీ ఆదేశించారు. ఈ ఘాట్ వద్ద దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటుచేసిన గదులు, చిన్నచిన్న స్టాల్స్ వద్ద వెనుక భాగం ప్రమాదకరంగా ఉందనీ, అక్కడ గోడ కట్టి రంగులు వేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన పుష్కరఘాట్ను పరిశీలించి, ఘాట్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మున్సిపల్ శాఖామంత్రి నారాయణతో సిఎం మాట్లాడుతూ అన్ని ఘాట్ల వద్ద యాత్రికులు స్నానం చేసే స్థలంలో ఇసుక వేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పుష్కర పనుల తనిఖీకి వెళ్లారు. ముఖ్య మంత్రి వెంట హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంఎల్ఎలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, ప్రత్యేకాధికారి కె.ధనుంజయరెడ్డి, కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, ఏలూరు రేంజ్ డిఐజి హరికుమార్ ఉన్నారు.