Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిపాల్ సింగ్పై వెనక నుంచి దాడి జరిపిన దుండగులు
షహజాన్ పూర్ (ఉత్తర ప్రదేశ్): సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న క్రిపాల్ సింగ్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనతో ఇప్పటివరకు సాక్షులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులపై దాడి జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ఆశారాం బాపు, ఆయన కుమారుడు సూరత్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలనే ఆశారాంకు చెందిన ఒక సాక్షి ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. తనకు సరైనా పోలీసు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేసిన విషయం విదితమే. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. షహజాన్ పూర్లో సర్దార్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండగులు జరిపిన కాల్పుల్లో క్రిపాల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. సింగ్ ఎల్ఐసీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. క్రిపాల్ శుక్రవారం 8 గంటల సమయంలో ద్వి చక్రవాహనంపై ఇంటికి వెడుతుండగా ఇద్దరు దుండగులు వెంబడించి వెనుక నుంచి కాల్పులు జరిపారు. పోలీసులు క్రిపాల్ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఆశారాం కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుని నుంచి వాంగ్ములం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జోద్పూర్లోని ఆశారాంకు చెందిన ఆశ్రమంలో 2013లో జరిగిన అత్యాచారం ఘటనలో క్రిపాల్ ముఖ్యమైన సాక్షిగా ఉన్నాడు. 3 మాసాల క్రితం క్రిపాల్ వాంగ్మూలాన్ని కోర్టు తీసుకుందని ఆయన తండ్రి చెప్పారు. తనను కేసునుంచి తప్పుకోవాలని దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తన కుమారుడు పేర్కొన్నాడని ఆయన చెప్పారు. ఆశారాం అనుచరులే క్రిపాల్పై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆశారాంకు కొంత మంది బిజెపి నాయకుల మద్దతు కూడా ఉందని ఆరోపణలున్నాయి.