Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ప్రధాన న్యాయమూర్తి
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా బ్లూవేల్ గేమ్పై నిషేధం విధించాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. బ్లూవేల్ గేమ్ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఎన్ఎస్ పూనరు అనే పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సామాజిక మాధ్యమాల్లో బ్లూవేల్ గేమ్ లింక్లను తొలగించాలని ఆదేశించకపోవడంతో దేశ వ్యాప్తంగా 200 మంది అమాయకులు బలయ్యారని అన్నారు. ఈ గేమ్ ఇలాగే కొనసాగినట్టయితే యువత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్వోన్నత ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషనర్ తరుఫున జయ సుకిన్ వాదనలు వినిపించనున్నారు. బ్లూవేల్ రాక్షస క్రీడ యువతపై దుష్ప్రభావాన్ని కనబరుస్తోంది. విదేశాల నుంచి భారత్కు పాకిన ఈ క్రీడకు బానిసైన యువతీ యువకులు తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు. ఈ గేమ్లో పాల్గొంటున్న విద్యార్థులకు 50వ రోజున ఆత్మహత్య చేసుకోవాలనే సంకేతాలు అందుతాయి. దాంతో, వారు ఏమాత్రం ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా, బ్లూవేల్ మరణాలపై మద్రాస్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో బ్లూవేల్ గేమ్ను నిషేధించింది. ఈ గేమ్ను షేర్ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించింది.