Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి చిరు వ్యాపారులపై..
- అమిత్ సాటమ్ దాడిదృశ్యాలు వైరల్, కేసునమోదు
ముంబయి: చిరు వ్యాపారులపై దాడికి పాల్పడ్డ మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అమిత్ భాస్కర్ సాటమ్పై ముంబయిలోని జుహు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను లంచం అడిగి బూతులు తిట్టారని, భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంధేరీ(పశ్చిమ) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ సాటమ్ తోపుడు బండ్ల వర్తకులను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబయిలోని విల్లే పార్లే ప్రాంతంలో తోపుడు బండ్లపై ఆహార పదార్థాలను విక్రయించే వ్యాపారులు తమను ఎమ్మెల్యే అమిత్ సాటమ్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని చెబుతున్నారు. అమిత్సాటమ్ తమ తోటి వర్తకులను బెదిరించి దాడికి పాల్పడటమే కాకుండా, తోపుడు బండ్లను ధ్వంసం చేసి ఆస్తి నష్టం కలిగించారని ఆజాద్ హాకర్స్ యూనియన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే, బహిరంగ ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లు పెట్టి వంటలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయని, చిరు వ్యాపారులను తాను లంచం ఎందుకు అడుగుతానని అమిత్ సాటమ్ అంటున్నారు. ఆవేశంలో తానలా మాట్లాడానంటూ అమిత్ సమర్థించుకుంటున్నారు.