Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ పోస్టుల భర్తీపై టీఆర్ఎస్ సర్కారు మాటతప్పినందుకు..
- వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశం
- కోర్టు ధిక్కరణగా పరిగణించాలి : పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్
- పోస్టుల ఖాళీలపై కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వాదన
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై కేసీఆర్ సర్కారు మాటతప్పడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీలు భర్తీ చేయకపోవడానికి గల కారణాలను వ్యక్తిగతంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఉపాధ్యాయ పోస్టుల నియామ కంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించిందని, దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్కుమార్ వాదించారు. పైగా ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల విషయంలోనూ కేంద్ర, రాష్ట్ర సర్కార్లు భిన్నమైన వాదన వినిపిస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. గతంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపక్మిశ్రా సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. కేసు విచారణను మరో ధర్మాసనం చేపట్టింది. సోమవారం కేసు విచారణకు రాగానే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూనియర్ న్యాయవాది ప్రశాంత్ హాజరయ్యారు. మొదట కేసును పాస్ఓవర్ చేయాలని అభ్యర్థించారు. అయితే కేసుపై మీ వైఖరేంటని ప్రశ్నించడంతో.. ఈ కేసులో అమికస్క్యూరీగా వ్యవహరిస్తున్న అశోక్గుప్తా జోక్యం చేసుకుంటూ.. వాళ్లు (తెలంగాణ రాష్ట్ర సర్కారు) రెండు నెలల వాయిదా కోరుతున్నారని ధర్మాసనానికి తెలియజేశారు. ఈ మేరకు రెండు నెలల గడువు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై పిటిషనర్ న్యాయవాది శ్రవణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'గత విచారణలో భాగంగా సెప్టెంబర్ మొదటివారంలోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర సర్కారు కోర్టుకు తెలిపింది. కోర్టు సైతం ఆ మేరకు ఆదేశించి కేసు వాయిదా వేసింది. కానీ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా వాయిదాలు కోరుతున్నారు' అని అన్నారు. కాగా రాష్ట్ర సర్కారు కోరినట్టు కేసును వాయిదా వేసిన ధర్మాసనం.. తదుపరి విచారణలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడానికి గల కారణాలను విద్యాశాఖ కార్యదర్శి స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కోర్టు ధిక్కరణగా పరిగణించండి...
తెలంగాణలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేపట్టకపోవడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్ ధర్మాసనాన్ని కోరారు. ఈ మేరకు ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతోందని తెలిపారు. 'తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం కోసం తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా... రెండు రాష్ట్రాల్లోని ప్రయివేటు పాఠశాలలు ప్రతి యేడాది రూ.12,500 కోట్ల విద్యావ్యాపారాన్ని చేస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పెద్దఎత్తున విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చేరుతున్నారు' అని అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా ప్రయివేటుపరం అవుతుందనడానికి ఇదే సంకేతమని తెలిపారు. పైగా ఉపాధ్యాయుల ఖాళీల విషయంలోనూ భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారని వివరించారు. 'కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ పార్లమెంట్లో రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం మేరకు తెలంగాణలో 14 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 8,700 పోస్టులు మాత్రమేనని చెబుతోంది' అని తెలిపారు. ఖాళీల విషయంలోనూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.