Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళపై లైంగికదాడి
- కేసు నమోదుచేసిన పోలీసులు
థానే : బీజేపీ కార్పొరేటర్ బరితెగించాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి 27 ఏండ్ల మహిళపై పదే పదే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకిరాగా, కళ్యాణ్ డొంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) కార్పొరేట్ దయా గైక్వాయిడ్పై కేసు పోలీసులు కేసు నమోదుచేశారు. దయా గైక్వాయిడ్కు సహకరించిన మరో పార్టీ నేతపై కూడా కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఏడాది జూన్ - ఆగస్టు మధ్య తనపై గైక్వాయిడ్ పదే పదే లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు థానే పోలీసు అధికారి సుఖడ నర్కార్ చెప్పారు. పెండ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయిస్తానని ఆమె హెచ్చరించగా.. అశ్విని ధుమాల్, ఆమె భర్త మనోజ్ ధుమాల్ల సహకారంతో ఆమె బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఇరికించేందుకు కుట్రపన్నినట్టు పోలీసులు తెలిపారు. 'ధుమాల్ల జంట బాధితురాలిని వారి ఇంటికి పిలిపించింది. విషయం బయటకురాకుండా ఉండాలంటే ఎంతకావాలో చెప్పమని ఆమెను అడిగారు. రూ. 10 లక్షలు, ఒక ఫ్లాటును ఇప్పిస్తామని అన్నారు. వారి మధ్య జరిగిన సంభాషణను ఆ జంట రహస్యంగా రికార్డు చేసింది. ఆ ఆడియో రికార్డును గైక్వాయిడ్కు పంపించారు' అని నర్కార్ చెప్పారు. నగదు కోసం తనను బెదిరిస్తోందనడానికి ఈ ఆడియోను సాక్ష్యంగా పోలీసులకు ఇస్తానని బాధితురాలిని గైక్వాయిడ్ హెచ్చరించినట్టు చెప్పారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వర్తక్నగర్ పోలీసు స్టేషన్లో కార్పొరేటర్పై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే గైక్వాయిడ్ను మాత్రం ఇంకా అదుపులోకి తీసుకోలేదు. దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.