Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని నరేంద్ర మోడీ
- సర్దార్ సరోవర్ డ్యాం జాతికి అంకితం
- సాగు,తాగునీటి ప్రయోజనాలు పొందనున్న నాలుగు రాష్ట్రాలు
కెవాడియా : సర్దార్ సరోవర్ డ్యాంను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఈ ప్రాజెక్ట్కు వచ్చినన్ని ఆటంకాలు ప్రపంచంలో మరే ప్రాజెక్ట్కూ రాలేదని, అన్నింటినీ అధిగమించి నిర్మాణం పూర్తి చేశామని, ఇది ఓ ఇంజినీరింగ్ అద్భుతమని ప్రధాని అన్నారు. ఈ ప్రాజెక్ట్ను అడ్డుకునేందుకు ఎవరెవరు ప్రయత్నించారో తనకు తెలుసునని, అయితే..తనకిపుడు ఆ పేర్లు వెల్లడించాలనే ఉద్దేశం లేదని ప్రధాని అన్నారు. ఈ ప్రాజెక్ట్పై తప్పుడు ప్రచారం చాలా జరిగిందని,మొదట అప్పిచ్చేందుకు అంగీకరించిన ప్రపంచబ్యాంక్ ఆ తర్వాత పర్యావరణ అభ్యంతరాలతో నిరాకరించిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రపంచబ్యాంక్ తోడ్పాటు లేకుండా సొంతంగానే డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేశామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల గుజరాత్లోని భారత్-పాక్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల నీటి కష్టాలు కూడా తీరుతాయని ప్రధాని అన్నారు.
గుజరాత్లోని నర్మదా జిల్లా కెవాడియాలో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ను నిర్మించారు. 1961లో ఈ ప్రాజెక్ట్కు భారత మొదటి ప్రధాని జవహర్లాల్నెహ్రూ శంకుస్థాపన చేశారు. దశలవారీగా ఈ డ్యాం నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వల్ల గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 లక్షలమంది రైతులకు సాగునీరు, 4 కోట్ల మందికి తాగునీరు అందనున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. ఈ డ్యాం పొడవు 1.2 కి.మీ...జలాశయం లోతు 163 మీటర్లు. ఈ ప్రాజెక్ట్ కింద రెండు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రోజుకు 1450 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 1200 మెగావాట్లు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ప్రాజెక్ట్ ముఖ ద్వారం వద్ద, 250 మెగావాట్లు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని కాలువ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు.
డ్యామ్ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోడీ తన 67వ పుట్టినరోజు సందర్భంగా తల్లి హీరాబెన్ నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. డ్యామ్ను ప్రారంభించిన అనంతరం కెవాడియాకు 50 కి.మీ. దూరంలోని దభోయి పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఎక్కువ కాంక్రీట్ వాడిన రెండో అతిపెద్ద డ్యామ్
అమెరికాలోని గ్రాండ్ కౌలీ డ్యామ్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాంక్రీట్ను దీని నిర్మాణానికి ఉపయోగించారు. గ్రాండ్ కౌలీకి 8 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడగా, సరోవర్ డ్యామ్కు 6.82 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు.
మొదటి నుంచీ వివాదాస్పదమే
ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గతంలో సుప్రీంకోర్టులో ఎన్బీఏసహా పలు సంస్థలు పిటిషన్లు వేశాయి. 1996లో డ్యాం నిర్మాణంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత 2000 అక్టోబర్లో డ్యామ్ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ముంపునకు గురయ్యే బాధితులకు పునరావాసం, పరిహారం అందించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డ్యాం నిర్మాణం,ఎత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు నర్మదా కంట్రోల్ అథారిటీ పేరుతో కమిషన్ ఏర్పాటైంది. 2006లో 121.92 మీటర్ల ఎత్తు వరకూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నర్మదా కంట్రోల్ అథారిటీ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత 2014 జూన్లో డ్యామ్ ఎత్తును 138.68 మీటర్ల వరకు పెంచుకునేలా అథారిటీ నుంచి అనుమతి లభించింది. ఈ ఏడాది జూన్లో డ్యామ్ 30 గేట్లనూ మూసివేసి పూర్తి సామర్థ్యం వరకూ(138.68 మీటర్లు) రిజర్వాయర్ను నింపాలని నర్మదా కంట్రోల్ అథారిటీ ఆదేశించింది. ఇప్పుడు ప్రధాని ప్రారంభించింది కూడా పూర్తి సామర్థ్యంతో నిండుగా ఉన్న ప్రాజెక్టునన్నది గమనార్హం. తాజాగా ఈడ్యాం 47లక్షల 30వేల ఎకరాల (4.73 ఎంఏఎఫ్) అడుగుల నీటి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది.
జల్ సత్యాగ్రహ దీక్ష విరమించిన మేధాపాట్కర్
నర్మదా నదిపై డ్యామ్ నిర్మాణం పట్ల సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ మొదటి నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బీఏ) పేరుతో డ్యామ్ వల్ల ప్రభావితమ య్యే రాష్ట్రాల్లో ఆమె ఉద్యమాన్ని నిర్వహించారు. పర్యావరణం, పునారా వాస సంబంధిత అంశాలపై సుదీర్ఘకాలంపాటు ఆమె ఉద్యమాన్ని నడిపారు. తాజాగా డ్యాం ఎత్తును పెంచడం పట్ల మేధా పాట్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లోని ముంపు ప్రాంతాల్లో మేధాపాట్కర్ నేతృత్వంలో బాధితులు జల్ సత్యాగ్రహ పేరుతో నీళ్లలోకి దిగి ఆందోళన చేపట్టారు. భోపాల్కు 300 కి.మీ. దూరంలో ధర్ జిల్లాలోని చోటాబర్దా గ్రామం లో శుక్రవారం నుంచి ఈ ఆందోళన కొనసాగించారు. గేట్లు మూసి ఉంచడం వల్ల ఇప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ముంపునకు గురైనట్టు తెలుస్తున్నది. నీటి నిల్వ ను తగ్గించడం కోసం గేట్లు తెరిచి ఉంచాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. డ్యాం ఎత్తు పెంచడం వల్ల 40 వేల కుటుంబాలు నిర్వాసితులు కానున్నట్టు ఎన్బీఏ చెబు తున్నది. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతా లకు తరలించేందుకు జాతీయ విపత్తు స్పందన దళాల (ఎన్డీఆర్ఎఫ్)ను ప్రభుత్వం అక్కడికి పంపించింది. అయితే, ప్రధాని మోడీ సరోవర్ డ్యాంను ప్రారంభించిన కొద్దిసేనటికి మేధాపాట్కర్ తమ దీక్ష విరమిస్తున్నట్టు ప్రక టించారు. అయితే, నిర్వాసితుల పునరావాసం కోసం ఆందోళన మరో రూపంలో కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు.