Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తుల నుంచి ఏటా రూ.1000 కోట్ల రాబడి
- కోటిమంది భక్తుల ఓట్లే ఎరగా రాజకీయ పార్టీల నుంచి నిధుల సమీకరణ
- రూ.40 కోట్లతో తీసిన రెండు సినిమాలకు రూ.15 కోట్ల నష్టం
- రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినట్టు గుర్మీత్ అనుచరుల ప్రచారం
- సిర్సాలో విలాసవంతమైన రిసార్ట్
- ఓ రాత్రి గడిపేందుకు రూ.1 లక్షా 20 వేలు
- డేరా కొత్త బాబాగా గుర్మీత్ తనయుడు..?
డేరా సచ్చాసౌదా గురువు గుర్మీత్ రామ్ రహీంసింగ్ నేర సామ్రాజ్యం వెనుక ఉన్న ఆర్థిక వనరులు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పేరిట భక్తుల నుంచి డేరా బాబా ఏటా దాదాపు రూ.1000 కోట్లమేర సమకూర్చుకున్నట్టుగా తెలుస్తున్నది. అంతుచిక్కని మరెన్నో ఆస్తులు వెలుగు చూడకుండా ప్రభుత్వ పెద్దలే గుర్మీత్కు అండగా నిలుస్తున్నారా..? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
సిర్సా:ఇద్దరు సాధ్విలపై లైంగిక దాడి కేసులో గుర్మీత్రామ్ రహీంసింగ్కు పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. గుర్మీత్ను జైలుకు పంపిన తర్వాత హర్యానాలోని సిర్సా పట్టణానికి సమీపంలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఆ రాష్ట్ర పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిం చారు. సోదాల్లో విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగు చూశాయి. ఆశ్రమంలో ఆయుధాలు, బాణాసంచా తయారీ ఫ్యాక్టరీని పోలీసులు కనుగొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా,రహస్యంగా ఆయుధాల ఫ్యాక్టరీని ఎలా ఏర్పాటు చేయగలిగాడన్న ప్రశ్నకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి. మరోవైపు అదే ఆశ్రమంలో గుర్మీత్ నివాస భవనం నుంచి సాధ్విలు ఉండే గదులను కలుపుతూ రెండు సొరంగ మార్గాలు బయట పడ్డాయి. సాధ్విలపై లైంగిక దాడులకు గుర్మీత్ ఆ సొరంగ మార్గాలను ఉపయోగించి నట్టుగా చెబుతున్నారు. ఇవేగాక విలాసవంతమైన భవ నాలు, మిరుమిట్లు గొలిపే అత్యాధునిక అలంకరణలతో కూడిన రిసార్టులు, ఖరీదైన కార్లు, ఇంకా ఇతర విలాస వస్తువులు వెలుగు చూశాయి. దీంతో, గుర్మీత్ తన భక్తులకు సన్యాసత్వం, త్యాగాల గురించి బోధిస్తూ తాను మాత్రం విలాసవంతమైన జీవితం గడిపాడని స్పష్టమైంది. డేరాలో చేరే భక్తులతో అవయవ దానానికి సంబంధించిన పత్రాలపై డేరా నేర సామ్రాజ్యం వెనుక
వేల కోట్ల అక్రమార్జన
సంతకాలు చేయించేవాడని గుర్మీత్ మాజీ శిష్యులు చెబుతున్నారు. అవయవాల బ్యాంకుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే, అందుకు సంబంధించిన వివరాలు బయటపడకుండా ఉన్నతస్థాయిలోని ప్రభుత్వ పెద్దలెవరో అడ్డుపడుతున్నట్టుగా అర్థమవుతున్నది. చట్టపరంగా చూస్తే డేరా సచ్చా సౌదాను ఓ దాతృత్వ సంస్థగా రిజిస్టర్ చేయించారు. అంటే..సంపాదన ఆశించకుండా సామాజిక సేవ చేయాలన్నది లక్ష్యం. దాంతో, డేరా ఆస్తులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. వాస్తవంలో మాత్రం డేరాలో చేరే భక్తుల నుంచి ఆధ్యాత్మిక కార్యకలాపాల పేరిట పెద్ద మొత్తాల్లోనే డబ్బులు వసూలు చేశారన్నది మీడియా పరిశోధనలో తేలింది. కోట్లాది రూపాయల ఆ నిధుల్ని గుర్మీత్ తన వ్యక్తిగత విలాసాలు, ప్రచారం కోసం వాడుకున్నాడు.
డేరా సచ్ఛాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్రహీమ్ సింగ్ (డేరా బాబా) జైలుకు వెళ్లిన అనంతరం అధికార పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే సస్పెన్స్కు తెరపడినట్టు తెలుస్తున్నది. ఇద్దరు సాధ్విలపై లైంగికదాడికి పాల్పడ్డ కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ స్థానంలో డేరా చీఫ్గా ఆయన కుమారుడు జస్మీత్ పగ్గాలు చేపట్టనున్నారు. దీనికి గుర్మీత్ కూడా అంగీకరించినట్టు తెలుస్తున్నది. నసీబ్కౌర్(జస్మీత్ నానమ్మ) ఈ నెల 14న సునారియా జైలుకు వెళ్లి తన కుమారుడు గుర్మీత్తో ఈ విషయమై చర్చించినట్టు డేరా వర్గాలు చెబుతున్నాయి. జస్మీత్ తర్వాతి స్థానాన్ని గురుదాస్సింగ్ సల్వారాకు ఇవ్వాలని కూడా గుర్మీత్ తన తల్లికి సూచించినట్టు సమాచారం. గుర్మీత్ బంధువైన గురుదాస్సింగ్ హర్యానా మాజీ డిప్యూటీ అడ్వొకేట్ జనరల్. గత నెల 25న పంచకులలోని సీబీఐ కోర్టులో గుర్మీత్ వెంట బ్యాగు మోసుకెళ్లడంతో గురుదాస్సింగ్ను డిప్యూటీ అడ్వొకేట్్ జనరల్ పదవి నుంచి తొలగించారు.
డేరాబాబా కీలక సహాయకుడు దిల్వర్ ఇన్సాన్ను శుక్రవారం సోనిపేట్లో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. మరోవైపు డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె కోసం లుకవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆమె ఇప్పటికే సరిహద్దులు దాటి నేపాల్ చేరుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే,డేరా ముఖ్య అనుచరుల్లో సాధ్వి విపాసన(35) పేరు కూడా వినిపిస్తున్నది. గత ఏడేండ్లుగా డేరా కార్యకలాపాల్లో గుర్మీత్ తర్వాత ఆమెదే పెత్తనమని సన్నిహితులు చెబుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో విపాసన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. రాజస్తాన్లో ఆమె తలదాచుకున్నట్టుగా చెబుతున్నారు.
ఇద్దరు సాధ్విలపై లైంగికదాడి కేసులో సీబీఐ కోర్టు గతనెల 25న గుర్మిత్ను దోషిగా తేల్చింది. ఆరోజు పంచకుల పట్టణంలో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లలో 38మంది మృతి చెందారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. అల్లర్ల కేసులో ప్రదీప్గోయల్ ఇన్సాన్, ప్రకాశ్ అలియాస్ విక్కీ, ఆదిత్య అనే కీలక నిందితులను అరెస్ట్ చేసినట్టు పంచకుల డీసీపీ మన్బీర్సింగ్ తెలిపారు.
అక్రమ సంపాదన వెనుక అధికార పార్టీ నేతల హస్తాలు..?
మరోవైపు బినామీల నిధులతో గుర్మీత్ పలు వ్యాపారాలను నిర్వహించినట్టు బయటపడింది. తనే హీరోగా, కథా రచయిత, దర్శకుడిగా మొత్తం ఐదు సినిమాలు నిర్మించిన విషయం తెలిసిందే. గుర్మీత్ హీరోగా తీసిన మొదటి రెండు సినిమాలు : మెసెంజర్ ఆఫ్ గాడ్(ఎంఎస్జీ), మెసెంజర్ ఆఫ్ గాడ్-2..ఈ రెండింటికి సంబంధించిన లెక్కలను పరిశీలిస్తే గుర్మీత్కు నిధుల సమీకరణలో తోడ్పాటునందించిన రాజకీయ నేతలపై అనుమానాలు రాక తప్పదు. మొదట్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న గుర్మీత్..2014 లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీకి మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. అధికారిక స్థానాల్లో ఉన్న బీజేపీ నేతలతో గుర్మీత్కున్న సన్నిహిత సంబంధాలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి.
డేరాకు అనుబంధంగా ఏర్పాటైన హకీకత్ ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సినిమాల నిర్మాణాన్ని గుర్మీత్ చేపట్టాడు. తన అనుచరుల పేరుతో ఈ కంపెనీని రిజిస్టర్ చేయించాడు. 2009లో ప్రారంభించిన ఈ కంపెనీ ద్వారా మొదటి మూడేండ్లలో తీసిన సినిమాలు నష్టాల్నే చవి చూశాయి. ఆ తర్వాత నిర్మాణం చేపట్టిన ఎంఎస్జీ-1, ఎంఎస్జీ-2 సినిమాల కోసం రూ.40 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఆ రెండు సినిమాలను అమ్మగా వచ్చింది మాత్రం 25 కోట్లేనని మార్కెట్ నిపుణుల అంచనా. అంటే..ఆ సినిమాల వల్ల రూ.15 కోట్లు నష్టమే. అయితే,రూ.100 కోట్లకుపైగా లాభాలు వచ్చినట్టు గుర్మీత్ అనుచరులు ప్రచారం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు 2015లో విడుదలయ్యాయి. ఆ తర్వాత మరో మూడు సినిమాలను కూడా గుర్మీత్ తనే హీరోగా నిర్మించి విడుదల చేశాడు. వాటికి సంబంధించిన లెక్కల్ని పరిశీలించాల్సి ఉన్నది. వీటికితోడు మ్యూజిక్ ఆల్బమ్లను కూడా గుర్మీత్ మార్కెట్లో పెట్టాడు. వాటిపై సంపాదనను మాత్రం చాలా అధికంగా చూపినట్టు పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం హకీకత్ ఎంటర్టైన్మెంట్ను మూసివేసినట్టుగా తెలుస్తున్నది.
సిర్సా ఆశ్రమ పరిసరాల్లోనే ఎంఎస్జీ రిసార్ట్ను కూడా గుర్మీత్ ఏర్పాటు చేశాడు. రిసార్ట్లోని గదుల్లో ఓ రాత్రి గడిపేందుకు రూ.లక్షా 25 వేలుగా వెబ్సైట్లో పేర్కొన్న ధరల్ని చూస్తే తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా డేరాకు 38 ఆశ్రమాలున్నాయి. వీటిలో ఎక్కువ భాగం హర్యానా,పంజాబ్, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నాయి. డేరాకు దాదాపు కోటిమంది భక్తులు ఉన్నట్టు చెబుతున్నారు. భక్తుల్లో ఎక్కువ భాగం సిక్కులు, కొద్దిమంది హిందువులు కూడా డేరాలో చేరినట్టు చెబుతున్నారు. డేరా ఆధ్యాత్మిక గురువులంతా సిక్కులు కావడం గమనార్హం. డేరా భక్తుల ఓట్లనే పెట్టుబడిగా పెట్టి గుర్మీత్ ఉత్తరాది రాష్ట్రాల్లోని అధికార పార్టీలతో సన్నిహిత సంబంధాలు నెలకొలుపుకున్నాడు. తన మాటే డేరా భక్తులకు దైవవాక్కుగా చెప్పుకునే గుర్మీత్..రాజకీయ పార్టీల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించినట్టు పరిశీలకులు చెబుతున్నారు. నిధుల సమీకరణకు సంబంధించి మీడియా పరిశోధనలో వెల్లడైన వాస్తవాలు ఇలా ఉన్నాయి...
గుర్మీత్ పేరిట అనుమానాస్పద నిధులు రూ.51 కోట్లు
డేరా ద్వారా నాలుగు కంపెనీలకు అప్పుగా ఇచ్చిన మొత్తం రూ. 1.33 కోట్లు
ఎంఎస్జీకి అజ్ఞాత వ్యక్తి పెట్టుబడి రూ. 1.80 కోట్లు
సినిమాలకు సంబంధించిన లావాదేవీల కోసం 15 బినామీ కంపెనీల ఏర్పాటు
2009 నుంచి 2011 వరకు హకీకత్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ తీసిన సినిమాలకు నష్టాలు
ఆ తర్వాత సినిమా కంపెనీకి గుర్తు తెలియని సంస్థల నుంచి రూ.19 కోట్లు
మరో రెండు అనుబంధ కంపెనీల నుంచి రూ.9 కోట్లు (ఎలా వచ్చాయో తెలియదు)
కొన్ని వస్తువులు అమ్మగా హకీకత్కు రూ.11 కోట్లు వచ్చినట్టు లెక్కలు(2012-13లో)
ఎంఎస్జీ, ఎంఎస్జీ-2 కోసం చేసిన ఖర్చు రూ.40 కోట్లు
ఆ రెండు సినిమాలను అమ్మగా వచ్చింది రూ.25 కోట్లు, అంటే..రూ.15 కోట్లు నష్టం
ఆ సినిమాల ద్వారా రూ.100 కోట్లకు పైగా వసూలైనట్టు గుర్మీత్ అనుచరుల ప్రచారం
ఎంఎస్జీ రిసార్ట్ కోసం పెట్టుబడులు పెట్టిందెవరు..?
రూ.15 కోట్లకు రిసార్ట్ను గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. రిసార్ట్ పెట్టుబడుల్లో చూపిన రూ.3 కోట్ల 20 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై వివరాలు లేవు. అజ్ఞాత వ్యక్తి ఒకరు రిసార్ట్లో మరో రూ.1 కోటి పెట్టుబడిగా పెట్టినట్టు చూపారు.