Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి, తెలుగు రాష్ట్రాలకు నోటీసులు
- నివారణకు తీసుకున్న చర్యలు వివరించాలని ఆదేశం
- తదుపరి విచారణ నవంబర్ 20కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయ స్థానం కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ, ఆంధ్రతో పాటు ఇతర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. మాదక ద్రవ్యాల నివారణకు చేపట్టిన చర్యలను వివరించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. డ్రగ్స్కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్కుమార్ వాదనలు వినిపించారు. డ్రగ్స్ మాఫి యాకు, సినీ ప్రముఖులకు మధ్య ఉన్న సంబంధాలపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా, పారదర్శకంగా విచారించడం లేదని పేర్కొన్నారు.
కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నుంచి సీబీఐకి అప్పగించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ తదతర రాష్ట్రాల్లో నార్కోటిక్స్ విభాగం సుమారు రూ. పది కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసిందని గుర్తు చేశారు. కాగా డ్రగ్స్ నివారణకు తీసుకున్న చర్యలను వివరించాలంటూ కేం ద్రానికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 20వతేదీకి వాయిదా వేసింది. అయితే రాష్ట్రంలోని డ్రగ్స్ కేసులో అత్యంత ప్రముఖుల, ధనవంతుల ప్రమేయం ఉందని, విచారణను పక్కదారి పట్టిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీని వెనుక ఉన్న వ్యక్తులు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, కేసును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. పబ్బుల్లో, హుక్కా కేం ద్రాల్లో, ఆశ్రమాల్లో ఈ డ్రగ్స్ సరఫరా, వినియోగం జరుగుతోందని, కాబట్టి వీటిని నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, బీహార్, పుదుచ్చేరి, యూపీ, గోవా, తమిళనాడు, కర్నాటక, ఒడిషా, అసోం, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్రను సీబీఐని ప్రతివాదులుగా చేర్చారు.