Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్స్, సాంకేతిక విద్య, పరిశోధనపై దృష్టి సారించాలి
- చైనా కన్నా భారత్ ఎంతో వెనుక : ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత వెంకటరామన్రామకృష్ణన్
న్యూఢిల్లీ: భారతీయులు విద్యపై.. ప్రత్యేకించి సైన్స్, సాంకేతిక విజ్ఞానంపై దృష్టి సారించాలని ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత వెంకటరామన్ రామకృష్ణన్ అన్నారు. ఎవరు ఏ మాంసం తినాలి అన్న మత సంబంధ వివాదాలతో కాలం వృథా చేయొద్దని ఆయన హితవు పలికారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ రామకృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో జన్మించిన రామకృష్ణన్ రసాయశాస్త్రంలో 2009లో నోబెల్ బహుమతి పొందారు. బ్రిటన్తోపాటు అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్న రామకృష్ణన్ ప్రస్తుతం కేంబ్రిడ్జి యూనివర్సిటీ బయోమెడికల్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ప్రతిష్టాత్మక రోయల్ సొసైటీకి అధక్షుడు కూడా..
చైనాతో పోలిస్తే భారత్ ఎంతో వెనకబడి ఉన్నదని, 50 ఏండ్ల క్రితం ఈ రెండు దేశాలు దాదాపు ఒకే స్థితిలో ఉన్నాయని రామకృష్ణన్ అన్నారు. తన అభిప్రాయం ప్రకారం గతంలో ఓమేరకు భారత్ పరిస్థితే మెరుగ్గా ఉన్నదని ఆయన అన్నారు. ఒకరితో ఒకరు తగువులాడుకునేకన్నా సహనంతో కలిసి ముందుకు వెళితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. లేనిపక్షంలో అవకాశాల్ని చేజార్చుకున్నట్టేనని ఆయన స్పష్టం చేశారు. మతపరమైన విద్వేషాలు దేశానికి నష్టం చేస్తాయని రామకృష్ణన్ హితవు పలికారు. విద్యా వ్యవస్థను మార్చాలని కూడా ఆయన సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం బోధించాలని ఆయన సూచించారు. డిగ్రీస్థాయిలో శాస్త్రీయ అంశాలను బోధించాలని తెలిపారు. సైన్స్ ప్రధానంగా అధ్యయనం చేసే విద్యార్థులు సామాజిక శాస్త్రాలపైనా దృష్టి పెట్టాలని రామకృష్ణన్ సూచించారు. వైజ్ఞానిక రంగాల్లో పెట్టుబడులు పెట్టకుండా ప్రగతి సాధ్యం కాదని రామకృష్ణన్ హితవు పలికారు. కొన్ని దేశాలకు వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధిలో వెనకబడటానికి కారణం తగినంత విజ్ఞానం లేకపోవడమేనని ఆయన అన్నారు. సైజులో బ్రిటన్తో పోలిస్తే ఎంతో పెద్దదైన భారత్లో విజ్ఞాన శాస్త్రాలు, ఆవిష్కరణలకు సంబంధించి అతి తక్కువ ఖర్చు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. భారత్లో విద్యావంతులు చాలా తక్కువగానే ఉన్నారని, ఆ లోటును భర్తీ చేయాలని ఆయన సూచించారు. విజ్ఞాన శాస్త్రాలు, పరిశోధన-అభివృద్ధిపై పెట్టుబడులు పెంచాలని రామకృష్ణన్ సూచించారు.