Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రాజస్థాన్లోని ఆల్వార్లో పెహ్లూఖాన్ను కొట్టిచంపిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు నిందితులకు క్లీన్చిట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మరోవైపు న్యాయం కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు 'గోరక్షకుల'కు వ్యతిరేకంగా కేసు నమోదుచేసిన పిటిషనర్లు తెహసీన్ పూనావాలా, షెహజాద్ పూనావాలా తెలిపారు. పెహ్లూఖాన్ కుటుంబసభ్యులు పడుతున్న బాధలను ఈ నెల 22న తాము సుప్రీంకోర్టుకు నివేదించనున్నట్టు చెప్పారు. చనిపోవడానికి ముందు పెహ్లూఖాన్ స్వయంగా గుర్తించిన ఆరుగురు నిందితులకు రాజస్థాన్ పోలీసులు గత వారం క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్లో తన కుమారులతో, ఇతరులతో కలసి పశువులను తరలిస్తుండగా గోరక్షకులు దాడికి పాల్పడ్డారు. అందరినీ తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పెహ్లూఖాన్ ఆస్పత్రిలో మృతిచెందారు.
'నిందితులకు రాష్ట్ర ప్రభుత్వ రక్షణ'
రాష్ట్ర ప్రభుత్వం నిందితులకు రక్షణ కల్పిస్తోందని బాధితుల తరఫు లాయర్ షెహజాద్ పూనావాలా ఆరోపించారు. దిగ్విజరు సింగ్తో కలసి ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడారు. కేసు విచారణను రాజస్థాన్ వెలుపలకు బదిలీచేయాలని తాము సుప్రీంకోర్టును కోరనున్నట్టు చెప్పారు.. అలాగే కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయనున్నట్టు తెలిపారు. రాజస్థాన్ పోలీసులపై ఒత్తిడి ఉందని, ఆ ఒత్తిడి మేరకే వారు పనిచేస్తున్నారని ఆరోపించారు. పెహ్లూఖాన్ నిందితులను గుర్తిస్తూ వాంగ్మూలం ఇచ్చినప్పటకీ... దర్యాప్తు నివేదికలో ఆ ఆరుగురు నిందితులకూ క్లీన్ చిట్ ఇచ్చారు. గో షల్టర్, కొందరు పోలీసులతో తప్పుడు సాక్ష్యం ఇప్పించారు. నిందితులు ఓమ్ యాదవ్, హుకుం చంద్ యాదవ్, సుధీర్ యాదవ్, జగ్మల్ యాదవ్, నవీన్ శర్మ, రాహుల్ షైనీలు దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనున్న రామ్ గోశాలలో ఉన్నట్టు అక్కడి అధికారులతో తప్పుడు సాక్ష్యం ఇప్పించారు. ఇక్కడ విశేషమేమంటే.. నిందితుల్లో ఒకరైన జగ్మల్ యాదవ్ ఈ గోశాలను పోషిస్తున్నాడు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేస్తే.. మరి పెహ్లూఖాన్ను కొట్టింది ఎవరు? అతని మృతికి కారణం ఎవరని షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో వారి పేర్లు ఎందుకు చేర్చారు? వీడియో ఆధారంగా తొలుత వారిని అరెస్టు కూడా చేసిన పోలీసులు.. ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. నిందితులంతా హిందూత్వ మితవాద గ్రూపునకు చెందినవారు కావడంవల్లే... క్లీన్ చిట్ లభించిందని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో ఈ కేసును ముందుకు ఎలా తీసుకెళతారని ప్రశ్నించగా.. 'గోరక్షకుల దాడులకు వ్యతిరేకంగా ఇటీవల తాము దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం, రాజస్థాన్ సహా ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. దాడులకు పాల్పడుతున్న గోరక్షణ దళాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి దాడులను అరికట్టేందుకు సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా అన్ని జిల్లాల్లో నియమించాల్సిందిగా కోర్టు ఆదేశించింది' అని షెహజాద్ పూనావాలా గుర్తుచేశారు. పెహ్లూఖాన్పై దాడి చేసిన నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దుచేసేలా ఆదేశాలివ్వాలని కూడా తాము సుప్రీంకోర్టును కోరనున్నట్టు చెప్పారు.
బాధితులనే నిందితులుగా...
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 'బాధితులనే నిందితులుగా చేస్తున్నారు. నిందితులకు రక్షణ కల్పిస్తున్నారు' అని షెహజాద్ ఆరోపించారు. రాజస్థాన్లోనూ పెహ్లూఖాన్పై కేసు నమోదుచేశారు. నిందితుల పక్షాన హోం మంత్రి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ దాద్రిలో మహమ్మద్ అఖ్లాక్ను కొట్టి చంపిన కేసులో కూడా అదే జరిగింది. నిందితుల్లో ఒకరైన రవిన్ సిసోడియా చనిపోగా, అతని మృతదేహంపై మూడురంగుల జెండాను వేశారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ స్వయంగా అతని నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పెహ్లూఖాన్ కుటుంబ సభ్యులకు బెదిరింపులు
తమ కుటుంబసభ్యులను చంపేస్తామంటూ పదే పదే బెదిరింపులు వస్తున్నట్టు పెహ్లూఖాన్ కుమారుడు ఇర్షాద్ తెలిపారు. అందుకే తాము రాజస్థాన్ వెలుపల కేసు విచారణను జరపాల్సిందిగా కోరుతున్నామన్నారు. పెహ్లూఖాన్ చనిపోయిన రాజస్థాన్లోని బెహ్రూర్లో కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వస్తుంటే... చంపేస్తామని నిందితులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కైయ్యారని.. అందుకే నిందితులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. 'ఇంకోసారి బెహ్రూర్ రండి... మీ సంగతి చూస్తాం...' అని నిందితులు బహిరంగ సవాలు విసురుతున్నారని ఇర్షాద్ వాపోయారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారేకానీ.. చర్యలు తీసుకున్న దాఖలాలే లేవన్నారు.