Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద ప్రజా, సామాజిక సంఘాలు
- 'జన్ ఏక్తా జన్ అధికార్ ఆందోళన్'గా ఆవిర్భావం
- నియంతృత్వ, ఫాసిస్టు శక్తులపై పోరుకు పిలుపు
- అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన
- 26 ప్రధాన డిమాండ్లతో ఉమ్మడి ఉద్యమం
- రైతు, కార్మిక పోరాటాలకు సంపూర్ణ సంఘీభావం
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అవలంబిస్తున్న నయా ఉదారవాద, మతతత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ఐక్య ఉద్యమాలు తీవ్రతరం చేసేందుకు జాతీయస్థాయిలో ఉమ్మడి వేదిక ఆవిర్భవించింది. సుమారు వంద సామాజిక, కార్మిక, ప్రజా సంఘాల నేతృత్వంలో 'జన్ ఏక్తా.. జన్ అధికార్ ఆందోళన్(ప్రజా ఐక్యత.. ప్రజాధికార ఆందోళన) రూపుదిద్దుకుంది. సోమవారం ఢిల్లీలోని మాల్యాంకార్ హాల్లో జరిగిన జాతీయ సదస్సులో వివిధ సంఘాల నేతృత్వంలో ఈ నూతన వేదిక ఆవిర్భవించింది. ప్రజాహక్కులపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎన్డీయే ప్రభుత్వం పాల్పడుతున్న దాడులు.. వివిధ వర్గాల్లో ఉధృతమవుతున్న నిరసనల నేపథ్యంలో ఐక్య కూటమి ఏర్పాటు జరిగిందని అనంతరం ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో ఆర్ఎస్ఎస్-బీజేపీ, ఇతర శక్తుల నియంతృత్వ, మతతత్వ పోకడలపై, నయా ఉదారవాద విధానాలపై పోరాటాలు చేపట్టే వామపక్ష, ప్రజాస్వామ్య, ఇతర సంస్థలను, వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ఈ ఐక్య వేదిక కృషి చేయనుంది. అందులో భాగంగా కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 9, 10, 11వ తేదీల్లో పార్లమెంట్ ముందు తలపెట్టిన ధర్నాకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలిపింది. అలాగే నవంబర్ 20న రైతు సంఘాలు పిలుపునిచ్చిన పార్లమెంట్ ముట్టడికి సంపూర్ణ మద్దతు తెలియజేసింది.
జన్ ఏక్తా.. జన్ అధికార్ ఆందోళన్ ఏర్పాటుకు ముందు సుమారు వంద ప్రజా, కార్మిక, సామాజిక సంఘాల ప్రతినిధుల సదస్సు ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్లోని మాల్యాంకార్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఆలిండియా కిసాన్ సభ(36క్యానింగ్ లైన్) జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్మొల్లా మాట్లాడారు. 'దేశంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ప్రజలందరు ఐక్యంగా ఉద్యమించాలి' అని పిలుపునిచ్చారు. మనువాద వికృతి చేష్టలకు సామాజిక కార్యకర్తలు, మేధావులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోమాంసం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, తినేతిండిపై ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక, రైతు, ఉద్యోగ, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, దళిత, గిరిజన, సామాజిక సంఘాలన్ని ఏకతాటిపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
శాస్త్రీయ ఆలోచనపై దాడి: కె.హేమలత, సిఐటియు
శాస్త్రీయంగా ఆలోచించే వారిపై దాడులు జరుగుతున్నాయని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత పేర్కొన్నారు. 'దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారిని హత్య చేశారు. దేశంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతమున్న చీకటి వాతావరణాన్ని పారదోలడానికి ఐక్య ఉద్యమాలు అనివార్యం' అని స్పష్టం చేశారు. 12 డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలన్ని నవంబర్ 9 నుంచి 11 వరకు ఆందోళన చేపట్టనున్నాయని వివరించారు.
మహిళపైన పెరిగిన దాడులు : ఎస్. పుణ్యవతి, ఐద్వా
ప్రజా ఐక్యత, ప్రజా హక్కుల కోసం ప్రజా ప్రతిఘటనను నిర్మించాలనేదే అందరి నినాదమని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మహిళపై, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాలని అన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
దళితులపై దాడులను తిప్పికొట్టాలి: వి.శ్రీనివాసరావు, డీఎస్ఎంఎం
దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని డిఎస్ఎంఎం కన్వీనర్ వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మూడేళ్ల మోడీ పాలనలో ఆయనిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించటం, ధరలు తగ్గించటం, అవినీతిని నిర్మూలించటం జరగలేదని పేర్కొన్నారు. దళితుల, గిరిజనుల, మహిళలకు సామాజిక రక్షణ కల్పిచడం మరిచారని అన్నారు. దేశంలో యువత, మహిళ, వివిధ రంగాల ప్రజానీకంలో పెద్దఎత్తున పెరుగుతున్న అసంతృప్తికి ఉద్యమ రూపం ఇవ్వటానికే అన్ని ప్రజా, సామాజిక, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయని తెలిపారు.
ఈ సదస్సులో అమర్జిత్ కౌర్(ఏఐటీయూసీ), కె.హేమలత (సీఐటీయూ), అతుల్ కుమార్ అంజన్ (ఏఐకెఎస్, అజరు భవన్), రాజీవ్ దిమ్రీ(ఏఐసీసీటీయూ), ఆర్.కె శర్మ(యూటీయూసీి), మనోజ్ భట్టాచార్య(ఆర్ఎస్పీ), అనిల్ చౌదరి(ఐఎన్ఎస్ఏఎఫ్), శంకర్(ఎంఎస్ఎం), మారిమం ధవలే, ఎస్ పుణ్యవతి (ఐద్వా), అనీ రాజా(ఎన్ఎఫ్ఐడబ్ల్యు), కవితా కృష్ణన్(ఏఐపిడబ్ల్యుఎ), విక్రమ్ సింగ్(ఎస్ఎఫ్ఐ), గౌతమ్ మోడీ(ఎన్టీయూఐ), కె.మధురీష్ కుమార్(ఎన్ఏపీఎం), రామ్ మలీక్(ఎఐఎఫ్డబ్ల్యూపీయూ), అమ్రారామ్, విజూ కృష్ణన్, పి. కృష్ణ ప్రసాద్(ఏఐకేఎస్, 36-క్యానింగ్ లైన్), తీస్తా సెతల్వాద్(సామాజిక ఉద్యమకర్త), వి.శ్రీనివాస రావు(డీఎస్ఎంఎం), అవరు ముఖార్జీ(డీవైఎఫ్ఐ), విజయ రాఘవన్(ఏఐఏడబ్ల్యూయూ), రామచంద్రన్ పిళ్లై, బి.వి రాఘవులు(కేవీపీఎస్) తదితరులు పాల్గొన్నారు.
26 డిమాండ్ల గుర్తింపు...
దేశంలోని ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి.. మొత్తం 26 డిమాండ్లను జన్ఏక్తా ఆందోళన్ రూపొందించింది. భవిష్యత్తు కాలంలో ఈ డిమాండ్ల సాధనకు ఉద్యమబాట పట్టనున్నట్టు పేర్కొంది. కాగా రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించాలని... అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని హన్నన్ మొల్లా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశంలో జరుగుతున్న రైతు, కార్మిక సంఘాలకు అండగా నిలవనున్నట్టు సదస్సు ముక్తకంఠంతో పేర్కొంది.