Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరింటిలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే
- జడ్జిల ఖాళీలు 407
- పెండింగ్ కేసులు 3 కోట్లకుపైగా
- న్యాయమూర్తుల నియామకంపై తాత్సారం
న్యూఢిల్లీ:దేశంలోని మొత్తం 24 హైకోర్టుల్లో ఆరు హైకోర్టులకు శాశ్వత ప్రధాన న్యాయమూర్తుల నియామకం ఇంకా జరగలేదు. దాంతో, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతోనే నడిపిస్తున్నారు. మరో నాలుగు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. హైదరాబాద్ (ఏపీ-తెలంగాణ) హైకోర్టు, కోల్కతా, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్ హైకోర్టులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోనే పని చేస్తున్నాయి. వీరిలో ఎక్కువభాగం చాలాకాలంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ 30, జులై, 2016 నుంచి,కోల్కతా హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా జస్టిస్ నిషితామహత్రే 1,డిసెంబర్, 2016నుంచి, ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గీతా మిట్టల్ 14,ఏప్రిల్, 2017నుంచి పని చేస్తున్నారు. శాశ్వత/తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తుల్లో నలుగురు ఈ ఏడాది డిసెంబర్ 4 వరకల్లా రిటైర్ అవుతున్నారు. దేశంలోని 24 హైకోర్టుల్లో ఉండాల్సిన జడ్జిల మొత్తం సంఖ్య 1079. ప్రస్తుతం పని చేస్తున్నదారి సంఖ్య 672. ఖాళీలు 407(ఇటీవల హైదరాబాద్ హైకోర్టుకు నియమితులైన ఆరుగురు జడ్జిలను పరిగణనలోకి తీసుకుంటే). ఈ ఏడాది జులై నుంచి నియామకాల ప్రక్రియ మందగించిందని న్యాయశాఖ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం సిఫారసు ఆధారంగా హైకోర్టు జడ్జిల నియామకాన్ని కేంద్ర న్యాయశాఖ చేపడుతుంది. జస్టిస్ దీపక్మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఆగస్టు 28న బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి దేశంలోని ఏ హైకోర్టు నుంచి కొత్తగా సిఫారసులు రాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. దేశంలోని హైకోర్టుల్లో మొత్తం 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తున్నది.
కొన్ని హైకోర్టుల్లో పని చేస్తున్న జడ్జిలకన్నా ఖాళీలే అధికంగా ఉన్నాయి. కర్నాటక హైకోర్టులో 27మంది పని చేస్తుండగా 35 ఖాళీలు, కోల్కతా హైకోర్టులో 31మంది పని చేస్తుండగా 41 ఖాళీలు, మణిపూర్ హైకోర్టులో ఇద్దరు పని చేస్తుండగా మూడు ఖాళీలున్నాయి. జస్టిస్ జెఎస్ ఖేహర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో సిఫారసు చేసిన 56 జడ్జిల నియామకాలు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తున్నది. కొలీజియం సిఫారసు చేసిన కొన్ని పేర్లు గత ఆరు నెలలుగా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది. కొలీజియం సిఫారసు చేసిన పలువురి నియామకం పట్ల కేంద్ర న్యాయశాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడమే కారణంగా పరిశీలకులు చెబుతున్నారు.
హైదరాబాద్ హైకోర్టు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఆరుగురు న్యాయ మూర్తులను నియమిస్తూ ఇటీవలే(ఈ నెల 18న) కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఉమ్మడి హైకో ర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. అయితే,ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 న్యాయమూర్తుల పోస్టులున్నాయి. ఇప్పుడు పని చేస్తున్నవారిలో నెల రోజుల్లోగా ఇద్దరు రిటైర్ కానున్నారు. దాంతో, ఉమ్మడి హైకోర్టుకు మరో 31మంది న్యాయమూర్తులు అవసరమవుతారు.