Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే టిక్కెట్ల కొనుగోలుపై వెల్లడించిన రైల్యాత్రి
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా వైపు ప్రజలు అడుగులేస్తున్నారని మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటుండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. ఇప్పటికీ 50 శాతానికి పైగా రైల్వే టిక్కెట్లు నగదు ద్వారానే కొనుగోలు అవుతున్నాయని రైల్యాత్రి తన సర్వే రిపోర్టులో వెల్లడించింది. అయితే.. డిజిటల్ చెల్లింపులపై అదనపు చార్జిలు విధించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలిపింది. అంతేకాక ఆన్లైన్ చెల్లింపుల్లో ప్రోత్సాహకాలు లేకపోవడం కూడా ఓ కారణమేనని పేర్కొన్నది. సర్వేలో భాగంగా రైల్యాత్రి.. 25 నగరాల్లోని దాదాపు 50 వేల మంది ప్రయాణికులను, 800 ట్రావెలింగ్ ఏజెంట్లను సంప్రదించింది. రైల్వే రిజర్వేషన్ కోసం చాలా మంది ట్రావెలింగ్ ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో రూ.2వేల కంటే తక్కువగా ఉన్న టిక్కెటు కొనుగోలుపై 0.7 శాతం అదనపు చార్జి పడుతున్నది. ఈ భారం ట్రావెలింగ్ ఏజెంట్లపైనే పడుతున్నది. అందుకే నగదు చెల్లింపులకే వారు మొగ్గు చూపుతున్నట్టు తెలిపింది. ఒకవేళ డిజిటల్ చెల్లింపులను అధికం చేయాలనుకుంటే తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైలుయాత్రి సహ వ్యవస్థాపకులు, సీఈఓ మనీష్ రాఠీ పేర్కొన్నారు. గడిచిన ఐదేండ్లలో రైల్వే టిక్కెట్ వ్యయాలు 80 శాతం మేర పెరిగాయని రిపోర్టులో పేర్కొన్నది. అదే విధంగా అధీకృత ఏజెంట్ల వ్యాపార వ్యయాలు కూడా పెరిగాయి. కాగా వారి కమిషన్ మాత్రం ఎన్నో ఏండ్లుగా టికెట్పై రూ.20 నుంచి రూ.40 మధ్యలోనే ఉన్నది. దీంతో వారు నగదుతోనే లావాదేవీలు కొనసాగిస్తున్నారు. కొనుగోలుదారుల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నా, అది రికార్డుల్లో నమోదు కాకపోవడంతో అంతిమంగా వినియోగదారులే ఎక్కువగా నష్టపోతున్నారని తన రిపోర్టులో పేర్కొన్నది.