Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో ఒక్క పైసా - మధ్యప్రదేశ్లో రూ. 4.75 పైసలు
- బీజేపీ పాలిత రాష్ట్రాల తీరిది
- విస్తుపోతున్న రైతులు
మధుర, భోపాల్ : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీ వివాదాస్పదమవుతోంది. వేలల్లో రుణమాఫీ ఉంటే.. రూపాయల్లో రద్దుచేసి సర్టిఫికెట్లు అందచేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోనూ అలాంటి విచిత్రాలే బహిర్గతమవుతున్నాయి. యూపీలో తాజాగా ఓ రైతుకు ఒక్కపైసా రుణ మాఫీ చేస్తున్నట్టు సర్టిఫికెట్ అందింది. అతడికి రూ. 1.6 లక్షల అప్పు ఉంది. ముఖ్యమంత్రి ఇటీవల ప్రవేశపెట్టిన రుణ విమోచన పథకం కింద రూ. ఒక పైసా రద్దుచేస్తున్నట్టు సర్టిఫికెట్ అందింది. అది చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాడు ఆ రైతు. మధురవాసి అయిన చిద్దీకి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆరేండ్ల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 1.55 లక్షలను పంట రుణం తీసుకున్నాడు. ముఖ్యమంత్రి రుణమాఫీ పథకం కింద రూ. లక్ష వరకూ మాఫీకి అతడు అర్హుడు. దాదాపు 86 లక్షల మంది రైతులకు ఈ పథకం వల్ల లబ్దిచేకూరుతుందని యోగి ప్రభుత్వం ప్రకటించింది. ఇది యూపీ ఖజానాకు రూ. 36 వేల కోట్లు ఖర్చుకానున్నట్టు తెలిపింది. ఈ పథకం కింద ఇప్పటివరకూ దాదాపు 12 లక్షల మంది రైతులు మాఫీ సర్టిఫికెట్లను కూడా పొందారు.
'ఇది అధికారులు లేదా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్వాకం కావచ్చు. నా తండ్రి 2011లో ఈ రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించినట్టు కనీసం రూ. లక్ష రుణమాఫీ కావాలి. ఆయన రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుచేయాలి. ఈ పైసా సర్టిఫికెట్ అందిన దగ్గర నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ, ఈ పైసా మాఫీ గురించి ఎవరూ స్పందించడంలేదు. వివరణ ఇవ్వడంలేదు' అని చిద్దీ కుమారుడు బన్వారీలాల్ వాపోయారు. కాగా ఈ వార్త మీడియాలో వెలుగులోకి రావడంతో అధికారయంత్రాంగం స్పందించింది. సాంకేతిక తప్పిందం కావచ్చంటూ మధుర జిల్లా యంత్రంగం తెలిపింది. సాంకేతిక తప్పిదమైతే... ఒకరు లేదా ఇద్దరికి ఇలా జరగవచ్చు. కానీ, ఇలా రూపాయలు, పైసల్లో రుణ మాఫీ సర్టిఫికెట్లు అందుకుంటున్నవారు వేలల్లో ఉన్నారు. రైతు శంభూనాథ్కు రూ. 12 రుణమాఫీ అయ్యింది. ఇతనికి 2016 నాటికి రూ. 28,812 రుణం ఉంది. రుణమాఫీ పోగా రూ. 28,800 కట్టాల్సిందిగా బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. అంటే అతడు రూ. 12 రుణమాఫీకి అర్హుడన్నమాట. షాజహాన్పుర్ జిల్లా రైతు రాం ప్రసాద్కు రూ.1.50 పైసలు రుణమాఫీ అయ్యింది. పైసల నుంచి పదులు, వందల్లో రుణమాఫీ సర్టిఫికెట్లు అందుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతులను అపహాస్యం పాల్జేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తూనే ఉన్నాయి.
పీఎం ఫస్కల్ బీమా యోజన కింద...
ఇది జోక్ కాదు.. మధ్యప్రదేశ్లోని ఒక రైతుకు ప్రధాని ఫస్కల్ బీమా యోజన కింద రూ. 4.70పైసలు పంట నష్టపరిహారం అందింది. సెహోర్ జిల్లా తిలారియాలోని 52 మంది రైతులకు వారి సోయాబీన్ పంట నష్టపోయినందుకు గాను మొత్తం రూ. 3,601.50 పై. పరిహారాన్ని అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి ఫొటోలతో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ సర్టిఫికెట్లను ఇటీవల రైతులకు అందచేశారు. ఈ 52 మందిలో అత్యధిక బీమా రూ. 194.24పైసలను నీలా భై అనే రైతు అందుకున్నాడు. 22 ఎకరాల్లోని సోయా బీన్ పంటను నీలా భై నష్టపోయారు. 'నాకు రూ. 194 నష్టపరిహారం అందింది. వారు ఈ నిర్ధారణకు ఎలా వచ్చారో ఆ దేవుడికే తెలియాలి' అని నీలా భై కుమారుడు వాపోయారు. 50 ఏండ్ల ఉత్తమ్ సింగ్ తన రెండు ఎకరాల పంటను నష్టపోయారు. ఇందుకుగాను అతనికి రూ. 17 ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందింది. సింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద రూ.1,342 చెల్లించడం గమనార్హం. సెహోర్లోని రెహ్తీ తహసిల్దార్ బదామీలాల్ రూ. 4.70పై. పరిహారం అందింది. 2016 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ఇదే జిల్లా నుంచి 'ప్రధాన మంత్రి ఫస్కల్ బీమా యోజన పథకాన్ని' ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జరిగిన మోడీ మెగా ఈవెంట్లో చిన్న మొత్తాల్లో బీమాను అందుకున్న దాదాపు ఈ రైతులందరూ పాల్గొనడం విశేషం. రుణమాఫీ చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని ఇదే రాష్ట్రం మండసోర్లో జూన్లో ఆందోళన చేసిన రైతులపై 'మహా' ప్రభుత్వం కాల్పులకు కూడా తెగబడింది. యూపీలో రుణమాఫీ అమలుచేస్తామని ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటిం చడంతో, తమ రుణాలను కూడా రద్దుచేయా లని డిమాండ్ చేస్తూ ఎంపీలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.