Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారులు, గర్భిణుల రేషన్ నిలిపివేసే యోచనలో కేంద్రం
- బదులుగా నగదు బదిలీ నిర్ణయం!
న్యూఢిల్లీ: మూడేండ్ల లోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న రేషన్లను మార్చి బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీని స్థానంలో నగదు బదిలీని తీసుకురావాలని మహిళా శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్(ఐసీడీఎస్)లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, ఇతర పోషక పదార్థాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఒక్కో చిన్నారికి రోజుకు రూ.6, గర్భిణులు, బాలింతలకు రూ.7 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. దీనివల్ల ప్రస్తుతం దేశంలో దాదాపు 6.5 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు. వీరిలో 4.6 కోట్ల మంది చిన్నారులు, 1.9 కోట్ల మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. నగదు బదిలీ విధానాన్ని తొలుత కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, తర్వాత అంతటా విస్తరింప జేయాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తున్నది. రేషన్ కింద రోజువారీ ఖర్చు పెట్టే మొత్తాన్ని స్వల్పంగా పెంచి, ఆ నగదును లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని యోచిస్తున్నది. తొలి దశలో అత్యంత వెనుకబడిన 300 జిల్లాలో రేషన్లకు బదులు నగదు బదిలీ విధానం చేపట్టి, ఏడాది కాలం తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని భావిస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు.. ఓ మీడియా సంస్థకు తెలిపారు.