Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్జీటీలో ఏపీ అభ్యర్థన
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ నుంచి తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని తప్పించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)కు ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. ఏపీ విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును పొందుపరిచారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు తెలంగాణ అంగీకారం తెలిపినట్టేనని పేర్కొంది. పోలవరం పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎన్జీటీ చైర్మెన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కేసు విచారించింది. ఈ సందర్భంగా ఏపీ సర్కారు రెండు అభ్యర్థనలు చేసింది. విభజనచట్టంలోని సెక్షన్ 90(3) ప్రకారం పోలవరం నిర్మాణానికి తెలంగాణ అంగీకరించినట్టేనని తెలిపింది. కాబట్టి ఈ పిటిషన్ నుంచి ప్రతివాదిగా తొలగించాలని కోరింది.
అలాగే ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు నమోదై ఉన్నందున ఎన్జీటీ విచారించొద్దని విన్నవించింది. కనీసం సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకైనా విచారణ నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. కాగా తెలంగాణను ప్రతివాదిగా తొలగించడంపై తమ వైఖరి తెలియజేయాలని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్కుమార్కు ధర్మాసనం సూచించింది. కేసు విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది.