Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ దేశాల్లో అస్థిరత్వం, నియంతృత్వ విధానాలు బలవంతంగా రుద్దే ప్రయత్నం
న్యూఢిల్లీ:కమ్యూనిజంపై ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా కుట్ర పన్నిందని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో విమర్శించింది. ' రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులను ప్రయోగించి వేలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అణ్వాయుధాలు ప్రయోగించిన దేశంగా చరిత్ర పుటల్లోకెక్కింది. ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తానని ఐరాస జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో అస్థిరత్వం పెంపొందించడమే కాకుండా, నియంతృత్వ విధానాలను కొనసాగించాలని అమెరికా ప్రయత్నిస్తున్నది. అందుకే, దక్షిణ కొరియా దేశానికి సహకరిస్తూ ఉత్తర కొరి యాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. కమ్యూనిజంపై గ్లోబల్ వార్ నినాదంతో అడుగులు వేస్తున్నది. అమెరికా విధానాల కారణంగా కొరియా భూభాగం రక్తసిక్తమైంది. కొరియా యుద్ధంలో వేలాది మంది అమాయక ప్రజలు మృతి చెందారు. ఆ విధంగా కొరియా భూభాగాన్ని చీల్చడంలో అమెరికా కుయుక్తులు ఫలించాయి. అంతేగాకుండా, ఇరాన్, వెనిజులా దేశాలపై ఉగ్రవాదమనే ముద్ర వేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా, స్వతంత్ర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నది. కుట్రపూరితమైన అమెరికా ఆలోచనా విధానాలు ఏమాత్రం ఆమోద యోగ్యమైనవి కాదు. ఉత్తరకొరియా వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఈ వివాదాన్ని సమిష్టి చర్చల ద్వారా పరిష్కరించవచ్చు ' అని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో పేర్కొన్నది.