Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో గళమెత్తిన అంగన్వాడీ వర్కర్లు
- రెగ్యులరైజేషన్ కోసం నిరవధిక దీక్షలు
శ్రీనగర్ : తస్లీమా సుల్తాన్.. 1983 నుంచి అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తోంది. గర్భవతులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతోపాటు, శిశువులకు రోగనిరోధక టీకాలను వేయడం తదితర పనులను చేస్తోంది. ఇందుకు ప్రతిగా తన సర్వీసును క్రమబద్ధీకరించాలని ఆమె అడుగుతోంది. 'అతి కొద్ది జీతం రూ. 3,600ల కోసం, 34 ఏండ్ల నుంచి నేను ఈ పనిలో ఉన్నాను. ఈ మొత్తం కాలంలో ప్రభుత్వం తన పనిని ప్రశంసించిందీ లేదు, అలాగే వేతనంలో ఎలాంటి పెంపూ లేదు' అని తస్లీమా వాపోయింది. అమెలా పనిచేస్తున్న వేలాది మంది ఆందోళనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. 'దోపిడీ నుంచి మహిళా అంగన్వాడీ వర్కర్లకు విముక్తి కల్పించండి' అని వారు నినదిస్తున్నారు. 'సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 50 శాతంకుపైగా సూపర్వైజర్ల నియామకం చేపట్టేందుకుగాను ప్రభుత్వం 2005లో ఉత్తర్వులు జారీచేసింది. నియామకాల్లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలతో ఆ పని అక్కడే పెండింగ్లో పడింది. చాలా ఏండ్లు అనుభవం తమకు ఉన్నప్పటికీ.. సూపర్వైజర్లుగా తమకు ప్రమోషన్లు కూడా ఇవ్వడంలేదు.. జీతాల పెంపూ లేదు' అని అంగన్వాడీ కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తస్లీమా విమర్శించారు. 28 వేల మంది అంగన్వాడీలు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ముందు బైఠాయించారు.
తమను క్రమబద్దీకరించాలని, గ్రాట్యుటీ, పెన్షన్ పథకం అమలుచేయాలని, అంగన్వాడీ కేంద్రాల ప్రయివేటీకరణను ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మా డిమాండ్లు పరిష్కరించేవరకూ ఆందోళన విరమించేదిలేదని అంగన్వాడీ కార్యకర్త రఫికా ఖన్నమ్ చెప్పారు.