Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: గురువారం నుంచి 30 వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొలిరోజు గురువారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దేవిగా అలంకరించనున్నారు. దర్శనానికి యాత్రికులను ఉదయం ఎనిమిది గంటల నుంచి అనుమతిస్తారు. ఈ సారీ యాత్రికులకు తిప్పలు తప్పేలా కనిపించడంలేదు. బారికేడ్లు, షామియానాలు మినహా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. విఐపిలను ఘాట్ రోడ్డు ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. సామాన్య యాత్రికులను మహామండపం ఏడంతస్తులు ఎక్కి దర్శనానికి వెళ్ల్లాల్సి ఉంది. నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పినా అవి అందుబాటులోకి రాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులూ ఇబ్బందులు పడనున్నారు. దుర్గా ఘాట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా దసరా ఉత్సవాలను అధికారులు పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను సిపి గౌతమ్సవాంగ్ బుధవారం పరిశీలించారు. ఉత్సవాలకు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది బుధవారం నుంచే విధులకు హాజరయ్యారు. దసరా ఉత్సవాల నుంచి దర్శనం టికెట్ ధర తగ్గించాలని ట్రస్ట్ బోర్డులో చేసిన తీర్మానంపై ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో యధావిధిగా టికెట్ ధరలు కొనసాగనున్నాయి. యాత్రికుల కోసం ఎపిటిడిసి ఆధ్వర్యంలో బరం పార్కులో రూ.135 లకే పది రకాల అల్పాహారాలను అందించనున్నారు.