Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజనులతో కలిసి రోడ్డుపై బైటాయించిన ఎమ్మెల్యే
శ్రీకాకుళం: గిరిజన విద్యార్థిని అగదల పార్వతిపై హత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక గిరిజన సంఘం ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలో భాగంగా గిరిజనులు పాతపట్నం మెయిన్ రోడ్డుపై బైటాయించి సుమారు గంట పాటు ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపిన కళావతి మాట్లాడుతూ పార్వతి హత్యకు గురై నెల రోజులు కావస్తున్నా విచారణ పేరుతో పోలీసులు తాత్సారం చేస్తున్నారన్నారు. కేసు విచారణ సమగ్రంగా సాగలేదని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును నీరుగార్చారని విమర్శించారు. సీఐ బి.ఎస్.ఎస్.ప్రకాష్, ఎస్ఐ హరికృష్ణ అక్కడకు చేరుకొని ఎమ్మెల్యేకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కేసులో సరైన ఆధారాలు ఇంకా లభించలేదని, అనుమానితులను విచారిస్తామని తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఛేదించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు, ఎమ్మెల్యే ధర్నా విరమించారు.
టీడీపీలో 'ఇంటింటికీ' పోరు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీల మధ్య నెల కొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధిష్టానం తమ గోడు పట్టించు కోవడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఇంటింటికీ టీడీపీ'ని బహిష్కరించే వరకూ చేరుకున్నారు. బీజేపీ మంత్రి మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల విషయంలో కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని మున్సిపల్ చెర్మెన్ బొలిశెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు టీడీపీ జిల్లా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమం చేపడితే పార్టీ నాయకులంతా వ్యతిరేకిస్తే పార్టీ ప్రతిష్టకు మచ్చ వస్తుందనే భావనతో పట్టణంలో నేటికీ ప్రారంభించలేదు. ఇదిలా ఉంటే కౌన్సిలర్ల నుంచి మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. మంత్రి మాణిక్యాలరావుతో వేగలేమని, ఈ విషయంలో ఉపేక్షిస్తే పార్టీకే నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొంటున్నారు. అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేసేలా ఒత్తిడి తెచ్చెందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టినట్లు అవుతుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై కొద్దిరోజుల క్రితమే పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జెడ్పి ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిలకు టిడిపి మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయినా వారినుంచి ఎటువంటి స్పందనా కన్పించలేదు. దీంతో ఛైర్మన్ నేతృత్వంలో కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.