Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే నెల 16, 17 తేదీల్లో 30 గంటల పాటు ధర్నా
అమరావతి: రాష్ట్రంలో నిర్వాసితుల పునరావాసానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉదయం ఈ పార్టీల నాయకులు సమావేశమై ప్రాజెక్టుల్లో సర్వస్వం కోల్పోయిన కుటుంబాల సమస్యలపై చర్చించారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఎం.కృష్ణమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎం.నాగేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, జెల్లి విల్సన్, న్యూడెమోక్రసీ నాయకులు వై.సాంబశివరావు, ఎంసీపీఐ నాయకులు వెంకటరెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకులు గుర్రం విజయకుమార్, కిషోర్బాబు, ఎస్యూసీఐ(సీ) నాయకులు సుధీర్, ఫార్వార్డ్బ్లాక్ నాయకులు సుందర రామరాజు, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశ నిర్ణయాలను రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వాసితుల సమస్యలపై విజయవాడలో 30 గంటల పాటు ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. నవంబర్లో జాతీయ నాయకత్వాన్ని ఆహ్వానించి రాష్ట్ర సదస్సు నిర్వహించాలని, నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఈ సదస్సు ద్వారా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. పోలవరం సహా నీటిపారుదల ప్రాజెక్టులకు, పోర్టులు, ఎయిర్పోర్టులు, పరిశ్రమలు, ఇండిస్టియల్ కారిడార్లు, సెజ్లు, రోడ్లు, రైల్వే లైన్లు తదితర అవసరాలకు ప్రభుత్వం లక్షల ఎకరాల భూమిని సేకరిస్తుదన్నారు. రెవెన్యూ యంత్రాంగం వారి బాధ్యతగా భూములు సేకరిస్తోందే తప్ప నిర్వాసితులకు పునరావాసం గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం మండలంలో ఎనిమిది, దేవీపట్నం మండలంలో ఆరు గ్రామాలను పోలవరం ప్రాజెక్టు కోసం తరలించారని, వారికి పునరావాసం కల్పించకుండానే ఇళ్లను బుల్డోజర్లతో పడగొట్టించారని పేర్కొన్నారు. దీంతో భూమి, ఇల్లు సర్వం కోల్పోయిన నిర్వాసితులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వం నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా 50 వేల మందితో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల లక్షలాదిమంది నిరాశ్రయులవుతున్నారని, అక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులే వారి పునరావాస కార్యక్రమాలు చూస్తున్నారని, తెలిపారు. కెఆర్పురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, కుకునూరు సబ్కలెక్టర్గా ఒకే అధికారి ఉన్నారని, అందువల్ల ఏ పనీ జరగడం లేదన్నారు. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇదే నిదర్శనమని తెలిపారు. నిర్వాసితుల సంఘం, సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలతో సహా కాలనీలు పూర్తయిన తరువాతే గ్రామాలను తరలించాలని, పునరావాసానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపట్టాలని వారు కోరారు. వ్యక్తిగత ఫిర్యాదులను రెండు మాసాల గడువులో పరిష్కరించాలన్నారు. అవినీతిపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఉండాలన్నారు.
నిర్వాసితులకు వివాదాస్పద భూములు కేటాయించొద్దని కోరారు. వంశధార తదితర ప్రాజెక్టుల నిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని కోరారు. ప్రభుత్వం వామపక్ష నాయకత్వంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, సిఎం, మంత్రుల పర్యటనలు జరిగిన ప్రతిసారీ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేయిస్తోందని తెలిపారు. వంశధార విషయంలో ప్రత్యేకంగా సిపిఎం నాయకులపై తప్పుడు కేసులు బనాయించిందని, వేధింపులకు పాల్పడుతోందని, ఈ చర్యలను వెంటనే ఆపేయాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందరికీ ఇవ్వలేదని, ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కర్నాటకలో జరిగిన గౌరీ లంకేశ్ హత్యను వామపక్ష పార్టీలు ఖండించాయి.