Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు విమానాల దారి మళ్లింపు
ముంబయి: కుండపోత వానలతో దేశ ఆర్థిక రాజధాని ముంబయి మరోసారి అతలాకు తలమైంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నగర మంతా జలమయమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బుధవారం 11 రైళ్లను పశ్చిమ మధ్య రైల్వే రద్దు చేసింది. మరో రెండింటిని దారి మళ్లించింది. అంతేకాక.. నగరంలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14, 32వ నెంబరు రన్వేలు మాత్రమే విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో.. ముంబయికి రావాల్సిన దాదాపు 50 విమానాలు రద్దయ్యాయి. పలు విమానాలకు బెంగళూరు, గోవా, హైదరాబాద్, ఢిల్లీకి మళ్లించారు. మరో 72 గంటల పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశమున్నదని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నిలిచిపోయిన 'డబ్బావాలా' సేవలు
భారీ వర్షాల నేపథ్యంలో ముంబయిలో బుధవారం డబ్బావాలా సేవలు(వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు లంచ్ బాక్సులను అందించడం) నిలిచిపోయాయి. ఉద్యోగులకు లంచ్ బాక్సులు అందించేందుకు డబ్బావాలాలు ప్రధానంగా రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. నగరంలోని 2 లక్షల మంది ఉద్యోగులకు డబ్బావాలా డెలీవరీ ద్వారా లంచ్ బాక్సులు అందుతున్నాయి. అయితే.. రైల్ సర్వీసులకు అంతరాయం కలుగుతున్న క్రమంలో తమ సేవలను బుధవారం నిలిపివేసినట్టు ముంబయి డబ్బావాలా అసోసియేషన్ నాయకుడు సుభాశ్ టాలేకర్ వెల్లడించారు. గతనెల 29న కూడా ముంబయిలో డబ్బావాలా సేవలు నిలిచిపోయాయి. ఆ రోజు నగరంలో రికార్డు స్థాయిలో 297.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.