Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీలో కొనసాగుతా : ఎంపీ జేసీ
అనంతపురం: 'ఐ యామ్ అట్టర్ ఫెయిల్యూర్ ఎంపీని. అందు కే మనస్సాక్షి చెప్పిన మేరకు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను' అని అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ.దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రికే ఢిల్లీకి వెళ్లి శుక్రవారం రాజీనామా పత్రాన్ని స్పీకరుకు అందజేయాలని భావించానన్నారు. అయితే స్పీకరు ఢిల్లీలో లేరని తెలియడంతో సోమవారం నాటికి ఆమె అపాయింట్మెంట్ తీసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్టు వివరించారు. గురువారం అనంతపురంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లో కొనసాగలేదని, ప్రజల ఆదరాభిమానాలతోనే తాను ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతు న్నానని చెప్పారు. ఇప్పుడు వారికిచ్చిన మాట నిలుపుకోలేకపోతున్నాననే బాధ తనను వెంటాడుతోందని తెలిపారు. దీంతో పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. తాడిపత్రి ప్రాంతంలోని చాగళ్లు రిజర్వాయరుకు నీళ్లివ్వాలని జిల్లా సాగునీటి సలహామండలి సమావేశంలో కోరానని గుర్తుచేశారు. అనంతపురం నగరాభివృద్ధి చేయాలని చూస్తే కొన్ని బలమైన శక్తులు దాన్నీ అడ్డుకుంటున్నాయని అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీనిస్తే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా అని విలేకరులు అడిగిన దానికి ఆయన స్పందిస్తూ... ఇప్పటికే అనేక సార్లు పరిష్కరిస్తామని చెప్పినా అమలు జరగలేదని అన్నారు. నాలుగు రోజుల్లో ఈ పనులు నెరవేర్చే చర్యలు తీసుకుంటే తప్పకుండా పునరాలోచిస్తానని పేర్కొన్నారు. పదవితోపాటు పార్టీకి రాజీనామా చేస్తున్నారా అని అడిగిన దానికి... పార్టీలో కొనసాగుతానని, కేవలం పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు.