Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శికి జూపల్లి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
తెలంగాణకు రావాల్సిన ఉపాధి హామీ చట్టం కూలి బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీకి వచ్చిన మంత్రి.. కృషి భవన్లో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టంలో భాగంగా రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు.
గడువులోగా నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కూలి చెల్లించడం ఇబ్బందిగా మారిందన్నారు. అయితే రూ.200 కోట్లు విడుదల చేస్తున్నట్టు అమర్జీత్సిన్హా చెప్పారని వివరించారు. కాగా మెటీరియల్కాంపోనెంట్లో రాష్ట్రానికి మరో రూ.500 కోట్లు కేంద్రం బకాయి ఉందన్నారు. కేంద్రంతో పొల్చితే తెలంగాణ రాష్ట్రం అదనంగా రూ.150 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అనంతరం అదనపు కార్యదర్శి డాక్టర్ నగేష్సింగ్తోనూ భేటీ అయినట్టు చెప్పారు.
తెలంగాణలో గ్రామీణభివృద్ధి శాఖలోచేపట్టిన పథకాలు, అభివృద్ధి అంశాలను వివరించినట్టు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో వంద రోజుల పనిదినాలు కల్పించేలా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర నిధులు పెండింగ్లో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని కూలీలకు కూలి డబ్బులు దసరాలోపు బకాయి లేకుండా చెల్లించనున్నట్టు చెప్పారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, కమిషనర్ నీతూప్రసాద్ తదితరులున్నారు.