Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహాల నిమజ్జనం యథాతథంగా జరగాలి: హైకోర్టు
కోల్కతా : దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విధించిన ఆంక్షల్ని కోల్కతా హైకోర్టు గురువారం రద్దు చేసింది. మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన సరైన కారణాలు లేకుండా నిరంకుశ ఆదేశాలిచ్చేందుకు వీలు లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్తివారీ నేతృత్వంలోని ధర్మాసనం మమతా బెనర్జీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మొహర్రం రోజుసహా అన్ని రోజుల్లోనూ దుర్గామాత నిమజ్జనాలు జరుపుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. ఏదో జరుగుతుందని కల వచ్చినంత మాత్రాన ఆంక్షలు విధించే అధికారం మీకు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ మతానికి చెందినవారైనా వారి విశ్వాసాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు హక్కు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ,ముస్లింలను సామరస్యంగా జీవించనీయండి, వారి మధ్య విభజన రేఖ గీయొద్దని హైకోర్టు హితవు పలికింది. నిమజ్జన యాత్ర, మొహర్రం ఊరేగింపు శాంతియుతంగా సాగేందుకు మార్గాలను నిర్ణయించాల్సిందిగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. శాంతి,భద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే హక్కుల విషయంలో వివాదం లేదని..అయితే, అందుకు మత స్వేచ్ఛ హక్కులకు భంగం కలగడాన్ని అనుమతించబోమని హైకోర్టు స్పష్టం చేసింది.
దుర్గామాత విగ్రహాలను ఈ నెల 30న (విజయదశమి రోజున) రాత్రి 10 గంటలవరకల్లా పూర్తి చేయాలని బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. మరుసటిరోజు(అక్టోబర్1న) మొహర్రం ఉన్నందున నిమజ్జనాలు జరపరాదని ఆంక్షలు విధించింది. అందుకు అభ్యంతరం తెలుపుతూ మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. హైకోర్టు వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఎవరైనా తన గొంతు కోయగలరేమోగాని, తాను ఏం చేయాలో ఆదేశించలేరని మమత అన్నారు. శాంతి భద్రతల కోసం తాను చేయాల్సింది చేస్తానని ఆమె అన్నారు.