Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు నిందితుల అరెస్ట్
అగర్తలా: త్రిపురలో బుధవారం జరిగిన జర్నలిస్ట్ హత్య, హింసకు సంబంధించి ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)కు చెందిన నలుగురు నిందితులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మండాయి, ఖుముల్వుంగ్ ప్రాంతాల్లో ఐపీఎఫ్టీ మిలిటెంట్లు జరిపిన దాడిలో 16మంది పోలీసులు గాయపడినట్టు త్రిపుర(పశ్చిమ) జిల్లా ఎస్పీ అవిజిత్ సప్తర్షి తెలిపారు. మిలిటెంట్లు విల్లంబులు, ఈటెలు, బాటిళ్లతో దాడి చేసినట్టు ఆయన తెలిపారు. ఐపీఎఫ్టీ ఆందోళనను రిపోర్ట్ చేయడానికి వెళ్లిన దినరత్ టీవీ ఛానల్ జర్నలిస్ట్ శాంతన్ భౌమిక్ కూడా ఆ ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. హింసాత్మక ఘటన నేపథ్యంలో పుకార్లు వ్యాపించకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
ప్రగతిశీల జర్నలిస్టుల గొంతు నొక్కేందుకే : సీపీఐ(ఎం)
త్రిపురలో ప్రగతిశీల జర్నలిస్టు శంతను భౌమిక్ను బీజేపీ వెన్నుదన్నుతో నడిచే ఐపీటీఎఫ్ అరాచక శక్తులు హత్య చేయడాన్ని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ హత్య మరువకముందే మరో ప్రగతిశీల జర్నలిస్టు హత్య జరిగిందని తెలిపింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ప్రగతిశీల జర్నలిస్టుల గొంతు నొక్కేందుకు, నిజాలు ప్రజలకు చేరకుండా చేసేందుకు బీజేపీ-ఆర్ఎస్ఎస్ వరుసగా హత్యలు చేస్తున్నాయని ఆరోపించింది. భౌమిక్ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. జర్నలిస్టు హత్యను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ఇన్ ఇండియా, నార్త్ ఈస్ట్ మీడియా ఫోరంలు ఈ హత్యను ఖండిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. మీడియా గొంతు నులిమేందుకే అమానుష చర్యలకు పాల్పడుతున్నారఁని పేర్కొన్నాయి.