Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్ : అవినీతి ఆరోపణల కేసులో ఒడిషా హైకోర్టు జడ్జి (రిటైర్డ్) ఐ.ఎం. ఖుద్దూసీ అరెస్ట్ అయ్యారు. జడ్జితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) పేర్కొన్నది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. దానిలోని వివరాల ప్రకారం...ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు బీపీ యాదవ్, పలాష్ యాదవ్లు లక్నోలో ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( పిమ్స్ )వైద్య కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే, 46 వైద్య కళాశాలల్లో బోధకులు, మౌళిక వసతులు సరిగ్గా లేవని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ వైద్య కళాశాలను మూసివేయాలని ఆదేశించింది. అంతేగాకుండా, రెండేండ్ల పాటు ఈ వైద్య కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు చేపట్టొద్దని ఆదేశించింది. ఈనేపథ్యంలో లక్నో వైద్య కళాశాల యాజమాన్యాన్ని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసినట్టయితే స్టే ఆర్డర్ ఇప్పి స్తానని జస్టిస్ (రిటైర్డ్) ఖుద్దూసీ సూచించినట్టు అభియోగాలు నమోద య్యాయి. అంతేగాకుండా, ఈ స్టే ఆర్డర్ను భారత వైద్య మండలి ( ఎంసీఐ) ఒకవేళ సుప్రీంకోర్టులో సవాల్ చేసినా అనుకూలమైన ఆదేశాలు ఇప్పిస్తానని ఓ మహిళ ద్వారా రాయబారం పంపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారినట్టు సీబీఐ అనుమానిస్తున్నది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బిస్వంత్ అగర్వాల్తో పాటు హవాలా ఆపరేటర్ పాత్ర పోషించిన రామ్దేవ్ సరస్వత్లను అదుపులోకి తీసుకుని విచారించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.
కాగా, జస్టిస్ ఖుద్దూసీ నివాసంతో సహా ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ బుధవారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే 2004-2010 మధ్య ఆయన ఒడిషా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంట్లో సీబీఐ సోదాలు !
ఒడిషా హైకోర్టు న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి చిక్కుల్లో పడ్డారు. సోదాలు నిర్వహించిన అధికారులు జస్టిస్ (రిటైర్డ్) ఖుద్దూసీ నివాసమనుకుని సిట్టింగ్ జడ్జి ఇంట్లో హల్చల్ సృష్టించారు. న్యాయమూర్తి ఇంట్లోకి చొరబడి ఇబ్బంది కల్గించారు. సీబీఐ వ్యవహారంపై మండిపడ్డ న్యాయమూర్తి ఒడిషా చీఫ్ జస్టిస్కు ఫిర్యాదు చేశారు. జస్టిస్ (రిటైర్డ్) ఖుద్దూసీ నివాసమని భావించి దాడులు నిర్వహించినట్టు తెలిపిన సీబీఐ అధికారులు...న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పారు. కాగా, సీబీఐ తీరు పట్ల ఒడిషా హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.