Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితుడి ఆనవాళ్లు గుర్తింపు
- గాలింపు ముమ్మరం
బెంగళూరు : కన్నడ సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య దర్యాప్తులో పురోగతి లభించింది. నిందితుడి ఆనవాళ్లను ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అతడి కోసం గాలింపు కూడా ముమ్మరం చేశారు. ప్రత్యక్షసాక్షులు చెప్పిన పోలీకలు, సీసీటీవీ ఫుటేజ్లో లభించిన ఆధారాలతో నిందితుడి నమూనా చిత్రాన్ని రూపొందించారు. అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుడి నమూనా ఫొటోను విడుదల చేయలేదని తెలుస్తోంది. అతడు 34 నుంచి 38 ఏండ్ల మధ్య వయస్కుడిగా అనుమానిస్తున్నారు. బజాజ్ పల్సర్ వాహనంపై వచ్చినట్టు ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. ఫుల్ హ్యాండ్ ఫార్మల్ షర్ట్ వేసుకుని ఉన్నాడనీ, ఐడెంటీ కార్డు కూడా ఉందనీ, ఎడమచేతి మణికట్టు వద్ద బ్యాండ్ కూడా కట్టుకుని ఉన్నట్టు ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. గౌరీ లంకేశ్ ఈ నెల 5న తన నివాసం వద్ద హత్యకు గురైన విషయం తెలిసిందే.
మా సభ్యులెవర్నీ ప్రశ్నించలేదు : హిందు జాగరణ్ వేదిక, సనాతన్ సంస్థ
గౌరీ లంకేశ్ హత్యను ఖండిస్తున్నట్టు హిందూత్వ సంస్థలు హిందు జాగరణ్ వేదిక, సనాతన్ సంస్థలు ప్రకటించాయి. ఈ హత్యకు సంబంధించి తమ సభ్యులెవరినీ సిట్ అధికారులు ప్రశ్నించలేదని చెప్పారు. ఆమె హత్య వెనుక హిందూత్వవాదుల హస్తముందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి కొందరు మీడియావారు, రాజకీయ నాయకులు, మేధావులు మాపై వేలెత్తి చూపుతున్నారని, హత్యతో తమకెలాంటి ప్రమేయంలేదని సంస్థ సభ్యులు ప్రకటించారు. ఈ రోజు వరకూ తమ సభ్యులెవరినీ దర్యాప్తు అధికారులు ప్రశ్నించలేదని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.