Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు, ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ తెలిపారు. గురువారం చెన్నైకు చేరుకున్న కేజ్రీవాల్ కమల్తో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ...కమల్ చాలా నీతిమంతుడు, ధైర్యవంతుడన్నారు. ఆయనకు భిన్నమైన ఆలోచనా ధృక్పథం ఉన్నదన్నారు. ప్రస్తుతం మన దేశంలో మతతత్త్వ భావాలు, అవినీతి పెరిగిపోయిందన్నారు. కమల్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిసి తనకు చాలా ఆనందం కలిగిందన్నారు. తాను కమల్కు వీరాభిమానినని చెప్పుకున్న కేజ్రీవాల్, కమల్ తప్పక రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నిజాయితీకి నిలువెత్తు దర్పణం కమల్ అని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదిలా ఉంటే, ఈ సమావేశంలో కమల్ చాలా తక్కువగా మాట్లాడారు. ఆప్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతోందని, కేజ్రీవాల్కు, తనకు భావసారూప్యత ఉందని అన్నారు. మతతత్వం, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తినవారంతా తన ఆత్మీయులేనన్నారు. కేజ్రీవాల్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం తనను కలిసేందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆప్లో చేరుతున్నారా? అని కమల్ని మీడియా ప్రతినిధులు పదేపదే అడిగినప్పటికీ ఆయన సమాధానాన్ని దాటవేశారు. దీంతో, కమల్ మనసులో ఏముందోనన్న ఊహాగానాలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. కమల్, కేజ్రీవాల్ ప్రధానంగా రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీపై తారాస్థాయిలో కమల్ విమర్శించారు. ఆయనకు డీఎంకే మద్దతిస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన డీఎంకే సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. మరోవైపు ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కమల్ సమావేశమైన విషయం తెలిసిందే. పినరయి సర్కార్ పనితీరును ఆయన ప్రశంసించారు.