Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రెనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
- ముగ్గురు పౌరులు మృతి, పలువురికి గాయాలు
- సురక్షితంగా బయటపడిన జమ్మూకాశ్మీర్ మంత్రి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చి పోయారు. భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్లతో విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో ముగ్గు రు పౌరులు మృతి చెందగా.. ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్ల తో సహా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ పట్టణంలో ఆ రాష్ట్ర మంత్రి నయీమ్ అక్తర్ గురువారం పర్యటిస్తున్నారు. కాగా.. నగరంలోని ఓ బస్టాండ్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు, జవాన్లపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. గ్రెనేడ్లు విసురుతూ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొన్నది. ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లను, పౌరులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దాడి సమయంలో ఘటనా స్థలికి అతి సమీపంలోనే మంత్రి నయీమ్ అక్తర్ ఉన్నారు. అయితే.. ఉగ్రదాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. నయీమ్ అక్తర్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడి చేశారా? అన్న కోణంలో పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి తెగబడిన ఉగ్రవాదులు.. బస్టాండ్ వద్ద ఉన్న జనసందోహాన్ని ఆసరాగా చేసుకొని అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారి కోసం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఇస్మాయిల్ ఎన్కౌంటర్ జరిగిన వారం రోజుల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. ఈనెల 14న జరిగిన ఎదురుకాల్పుల్లో ఇస్మాయిల్, మరో ఉగ్రవాది హతమైన సంగతి తెలిసిందే. జులైలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి ఇస్మాయిల్ ప్రధాన సూత్రధారి. ఆనాటి దాడిలో 8 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
బీఎస్ఎఫ్ పోస్టులే లక్ష్యంగా పాక్ కాల్పులు
జమ్మూకాశ్మీర్లోని ఆర్నియా సెక్టార్ వద్ద పాకిస్థాన్ రేంజర్లు గురువారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. ఆర్నియా సెక్టార్లోని ఖుర్ద్, పిండి, కతార్, జబోవాల్, కోల్ ఖుర్ద్ ప్రాంతాల్లో ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) పోస్టులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిపారు.