Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంశధార నిర్వాసిత ప్రాంతాల పర్యటనను అడ్డుకున్న పోలీసులు
- మెళియాపుట్టి పోలీస్ స్టేషన్లో నిర్బంధం
- నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం : మధు
- సబ్జైలులోని సీపీఐ(ఎం) నేతలకు పరామర్శ
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధును మళ్లీ అరెస్టు చేయించింది. రాష్ట్రంలో ఆయన ఎక్కడకు వెళ్లినా అరెస్టు చేయిం చడం ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. వంశధార నిర్వాసితులకు సంఘీభావం తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయననూ, మరో పది మంది వామపక్ష నేతలనూ పోలీసులు శనివారం అక్రమంగా అరెస్టు చేశారు. నేతల అరెస్టులను పది వామపక్షాలు ముక్తకంఠంతో ఖండిచాయి. అరెస్టయిన వారిలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి తదితరులు కూడా ఉన్నారు. వీరందరిపై సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు. సాయంత్రం వరకూ పోలీస్ స్టేషన్లో ఉంచి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తొలుత మధుతోపాటు నాయకులు పాత పట్నం సబ్జైలుకు వెళ్లి.. వంశధార నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 18న ఆందోళన చేపట్టిన సందర్భంగా అరెస్టు చేసిన 16 మంది సిపిఎం నాయకులను పరామర్శించారు. తర్వాత వంశధార నిర్వాసితులను కలుసుకునేందుకు అక్కడి నుంచి హిరమండలం వైపు బయలు దేరారు. సారవకోట మండలం నవతల కూడలి వద్ద పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లతో రోడ్డును దిగ్బంధనం చేశారు. మధు వస్తున్న వాహన శ్రేణిని అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకూ, వామపక్ష నాయకులకూ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తాము వంశధార నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు హిరమండలం వెళ్తున్నామని, తమను ఆపడం సరికాదని వామపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. హిరమండలం ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. దీంతో మధు కారు దిగి బయటకు వచ్చారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని చావబాదుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుకు దూసుకెళ్తున్న మధును పోలీసులు అరెస్టు చేసి జీపులోకి ఎక్కించారు. మధును తీసుకెళ్తున్న జీపును అడ్డుకున్న సీపీఐ(ఎం) నాయకులు డి.గోవింద రావును మరో వాహనంలో ఎక్కించారు. అక్కడ మొత్తం పది మందిని పోలీసులు అరెస్టు చేసి మెళియాపుట్టి మండల పోలీస్ స్టేషన్కు తరలించారు.