Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గూర్గావ్: రియాన్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తన విచారణను ప్రారంభించింది. ఏడేండ్ల బాలుడి దారుణ హత్యపై సీబీఐ శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే గూర్గావ్లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూలును ముగ్గురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం శనివారం సందర్శించింది. సీబీఐ అధికారుల వెంట ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా వెళ్లి పలు కీలక ఆధారాలను సేకరించింది. రెండో తరగతి చదువుతున్న ప్రధుమ్యాన్ ఠాకూర్ ఈనెల 8న స్కూల్లోని టాయిలెట్లో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. బాలుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తూ బస్సు క్లీనర్ అశోక్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధ్యుమ్యాన్ను తానే హత్య చేసినట్టు విచారణలో అశోక్కుమార్ ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఘటనలో బస్సు క్లీనర్కు ఎలాంటి సంబంధమూ లేదని, అతడిని కావాలనే కేసులో ఇరికించారని బాలుడి తల్లిదండ్రులు, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్ సైతం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం ఈనెల 15న సీబీఐ విచారణకు ఆదేశించింది.