Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతడిని నమ్మాం.. మోసం చేశాడు: బాధితురాలి తండ్రి
జైపూర్ : ఆధ్యాత్మిక ముసుగులో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన ఫలహారీ బాబాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్కు చెందిన 21 ఏండ్ల యువతి బాబాపై పోలీసులకు ఇటీవల ఫిర్యాదుచేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదైనట్టు తెలుసుకున్న అతడు అనారోగ్యం సాకుగాచూపి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. ఫలహారీ బాబాగా పేరుగాంచిన కుశలేంద్ర ఫలాహరి మహరాజ్ (70)ను ఆస్పత్రిలో అదుపులోకి తీసుకున్నామనీ, వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామనీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆల్వార్ పోలీసులు ఒక వైద్యులతో కూడిన ఒక మెడికల్ బోర్డును కూడా ఏర్పాటుచేశారు. గత నెల 7న కుశలేంద్ర బాబా తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు లా విద్యార్థిని, ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం నుంచి అతడు ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో ఉంటున్నాడు. అతడు ఫిట్గా ఉన్నాడనీ, డిశ్చార్చి చేసేందుకు సిద్ధమని ఆస్పత్రి అధికారులు ప్రకటించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లైంగికదాడి కేసులో ఒక మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డేరా బాబాకు 20 ఏండ్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబసభ్యులు ధైర్యంతో ఫలహారీబాబాపై వీరు కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.
గుడ్డిగా నమ్మాం..
దైవాంశ సంభూతుడిగా భావించి అతడిని గుడ్డి నమ్మాం. 'బాబా మమ్మల్ని దోచేశాడు. మాకు తీరని వ్యథను మిగిల్చాడు. ' అని బాధితురాలి తండ్రి వాపోయారు. 'గత 15 ఏండ్లుగా మా కుటుంబం అతడిని విశ్వసిస్తోంది. 1986 నుంచి మా కుటుంబసభ్యులు ఆల్వార్ వచ్చి వెళుతుండేవారు. మంచి ప్రసంగం ఇచ్చేవారు. కానీ అతడి అసలు రూపం ఈ విధంగా బయటపడింది' అన్నారు.
నోయిడాలో మరో నిర్భయ ఘటననోయిడా : ఢిల్లీ శివారు ప్రాంతంలోని నోయిడాలో మరో నిర్భయ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న కారులో 24 ఏండ్ల మహిళపై శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. నోయిడా గోల్ఫ్ కోర్స్ మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం తాను కారు ఎక్కానని, అర్ధరాత్రి తర్వాత తనను ఢిల్లీలోని అక్షరథామ్ దేవాలయ సమీపంలో పడేసి వెళ్ళారని బాధితురాలు ఆరోపించింది. నోయిడా సెక్టార్ 26 ప్రాంత నివాసిగా ఆమెను గుర్తించారు. మహేంద్రా స్కార్పియో వాహనంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, బస్సు కోసం నుంచున్న తనను బలవంతంగా కారులో ఎక్కించారని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి వరకూ కారులో తిప్పుతూ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. రెండు గంటల ప్రాంతంలో కారులో నుంచి తోసేసి వెళ్ళిపోయారనీ ఆమె తెలిపింది. ఘటనా స్థలం నుంచి ఆ రాత్రి పోలీసులకు ఫోన్చేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నవారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసు అధికారి దీక్షిత్ చెప్పారు. లైంగికదాడి కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేపట్టామని తెలిపారు.